KTR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెట్టింది. కేంద్రం పెట్టిన కత్తికి కాంగ్రెస్ సానబెడుతోంది. వేలం పాటను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచం, శ్రీరామరక్ష అని కేసీఆర్ ఈ 25 ఏండ్లలో ఒక్కసారి కాదు వేల సార్లు చెప్పారు. కానీ ఇవాళ ఏం జరిగింది. కేసీఆర్ 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అని మొత్తుకున్నారు. కేంద్రంలో నిర్ణయాత్మక పాత్రలో ఉంటామని చెప్పారు. 16 ఎంపీలతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది చాలా మాట్లాడారు. కానీ ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ నిర్ణయాత్మక పాత్రలో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిపోయింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఇవాళ హైదరాబాద్లో బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారని కేటీఆర్ తెలిపారు.
బొగ్గు గనులను వేలం వేయొద్దని 2021, డిసెంబర్ 8న కేంద్రానికి నాటి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి బొగ్గు గనులను అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. బీహార్లోని చెస్నా అనే ప్రాంతంలో ఆనాడు బొగ్గు బావిలో ప్రమాదం జరిగి వందల మంది కార్మికులు చనిపోయారు. నాటి కేంద్ర ప్రభుత్వం.. బొగ్గు గనులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల కిందనే ఉండాలని, ఉంటేనే రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి, 1975 – 76 లో నాటి కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ లేఖ రాశారు. ప్రస్తుతం సింగరేణిలో 51 శాత రాష్ట్రం వాటా, 49 శాతం కేంద్ర వాటా ఉంది. కాబట్టి సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలని కేసీఆర్ అడిగారు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసెంబర్ 11, 2021.. ప్రధానికి లేఖ రాశారు. నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలి. వేల మంది వర్కర్లు రోడ్డున పడుతారని చెప్పారు. కానీ ఇవాళ బొగ్గు గనుల వేలంలో పాల్గొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేత చెప్పించారని కేటీఆర్ గుర్తు చేశారు.
మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా ఏ టెండర్, వేలం లేకుండా.. ఒడిశాలో రెండు గనులను నైవేల్లి లిగ్నైట్ లిమిటెడ్కు అప్పగించారు. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ ఇండస్ట్రీ పవర్ లిమిటెడ్కు 2015లో నాలుగు బొగ్గు గనులు అప్పజెప్పారు. ఒక వైపు ఒడిశాలో రెండు, గుజరాత్లో రెండింటికి ఐదు బొగ్గు గనులు అప్పజెప్పారు. తమిళనాడులోనూ ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు గనులు వేలం లేకుండా ఇచ్చారు. అదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పోయింది ప్రయివేటీకరణకు అప్పగిస్తున్నామని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సింగరేణి విషయంలో కూడా ఇదే వైఖరి అవలంభిస్తారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది. రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎందుకు మాయమైంది. ముఖ్యమంత్రిగా వేలం పాటలో పొల్గొంటామని చెబుతున్నారు. ఇది దారుణం అని కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్రం మా మెడ మీద కత్తి పెట్టినా బొగ్గు గనులను వేలం వేయకుండా చూశాం. తొమ్మిదిన్నరేండ్లు సింగరేణిని కాపాడుకున్నాం. సింగరేణి లాభపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. కార్మికులు లాభపడుతారు. సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ ఊదితే దక్షిణ భారతదేశం అంధకారంలోకి వెళ్లిన పరిస్థితి. ఎప్పటికైనా సింగరేణిని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మన గనుల్లో మనం బొగ్గు తవ్వుకోకుండా అడ్డుకోవడం దుర్మార్గం. సింగరేణి కార్మికులు అన్నీ అర్థం చేసుకోవాలి. సింగరేణి బొగ్గు బ్లాకులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టడాన్ని ఖండిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినట్టే సింగరేణిని ఖతం చేస్తారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 సీట్లు ఇచ్చినందుకు సింగరేణిని నాశనం చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వ చేతగానితనం వల్లే మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి దోపిడీకి తెర తీశాయి. కేసీఆర్ ఆనాడు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనలేదు. బీఆర్ఎస్ లోక్సభలో లేదు కాబట్టే.. ఇవాళ సింగరేణి గనులను వేలం వేస్తున్నారు. 2021లో కేంద్రానికి లేఖ రాసిన రేవంత్ ఇప్పుడెందుకు మారిపోయాడు. రేవంత్ రెడ్డికి కేసుల భయం పట్టుకుందా..? సింగరేణిని బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నిర్ణయానికి కాంగ్రెస్ ఎందుకు వంత పాడుతోంది. రేపు వేలం పాటలో డిప్యూటీ సీఎం ఎందుకు పాల్గొంటున్నారు. సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెట్టింది. కేంద్రం పెట్టిన కత్తికి కాంగ్రెస్ సానబెడుతోంది. వేలం పాటను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.