బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది కాంగ్రెస్ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం. మీ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదన్న విషయాన్ని మరచిపోవద్దు.-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగా ణ): ప్రజాపాలన అంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడటమేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధులు లేక, పెండింగ్ బిల్లులు రాక పం చాయతీలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయ ని, పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ బుధవారం ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించా రు. పల్లెలపై ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో పాలన పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని దుయ్యబట్టా రు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణను పట్టించుకోకపోవటంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని, దోమల మందుకు కూ డా నిధులు లేకపోవడంతో డెంగ్యూ, మలేరి యా లాంటి విషజర్వాలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీల నిర్వహణ తీవ్ర సంక్షోభంలో పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అప్పుల ఊబిలో మాజీ సర్పంచ్లు
పంచాయతీల్లో పాత పనుల బిల్లులు చెల్లించడం లేదని, దీంతో అప్పుల ఊభిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్గా రూ.275 కోట్లు వి డుదల చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పా పానికి 1,800 మంది మాజీ సర్పంచ్లపై ని ర్బంధాలు ప్రయోగిస్తూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చి న రూ.2,100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మొత్తం 12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్తు బకాయిలే రూ.4,305 కో ట్లు ఉన్నాయని, వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే.. పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాపాలనలో పల్లెప్రగతికి పాతరేసి.. పట్టణప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట ని జం కాదా? అని నిలదీశారు. మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మతులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పట్టణ సంస్థల్లో జీతాలు ఇవ్వలేని దుస్థితి
మున్సిపాలిటీల్లో రూ.1,200 కోట్లకుపైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఎప్పుడు విడుదల చేస్తారని కేటీఆర్ నిలదీశారు. ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే, ఇతర శాఖల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రేటర్తోపాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉన్నదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘ఆగస్టు 15లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ప్రభుత్వానికి ఉన్నదా? కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెకించే ధైర్యం ఉన్నదా? మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టే ఆలోచన ఉన్నదా?’ అని నిలదీశారు.