KTR | హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రేపు వచ్చి ఇదే రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి.. కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వం. వాళ్లకుండా తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచిన తర్వాత.. రంజిత్ రెడ్డి ఫోన్ చేసి ఏదేమైనా సరే.. అడ్వాన్స్గా ఎన్నికలకు పోవాలి.. ఫస్ట్ మీటింగ్ చేవెళ్లలో పెట్టి నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే పనిలో పడుతాను.. చేవెళ్లలో గెలిచి చూపించాలి. ఇక అందరికీ ఫోన్ చేసి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టాం. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని నియోజకవర్గాల్లో తిరుగుదాం అని నిర్ణయించుకున్నాం. నేనే చేవెళ్ల అభ్యర్థిని రంజిత్ రెడ్డి మీడియాతో చెప్పారు. ఇక భవన్ నుంచే చేవెళ్ల, పరిగి పర్యటనకు రంజిత్ రెడ్డితో కలిసి కారులో బయల్దేరాం. మన్నెగూడ వద్ద పట్నం మహేందర్ రెడ్డి కారు ఎక్కారు. ముగ్గురం కలిసి పోతుంటే.. మహేందర్ రెడ్డికి నీ మీద పుకార్లు వస్తున్నాయి అని చెప్పాను అని కేటీఆర్ తెలిపారు.
ఇక పరిగి, చేవెళ్ల మీటింగ్స్లో నా కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని పొల్లుపొల్లు తిట్టారు. పరిగిలో నాలుగైదు వేల మంది మీటింగ్లో ఉన్నారు. కారులో చెప్పిన ముచ్చట కార్యకర్తల ముందు చెప్పమని పట్నం మహేందర్ రెడ్డికి సూచించాను. కాంగ్రెస్లోకి పోతున్నట్లు నా మీద పుకార్లు వస్తున్నాయి. నా ఒక్కని మీద వస్తలేవు.. రంజిత్ రెడడి మీద కూడా వస్తున్నాయి అని మహేందర్ రెడ్డి అన్నారు. ఇక ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు. ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారు. నేను ఇద్దర్నీ నమ్మాను. అద్భుతమైన స్పీచ్లు ఇచ్చారు. చూస్తే 15 రోజుల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించారు అని కేటీఆర్ తెలిపారు.
2014లో విశ్వేశ్వర్ రెడ్డిని పట్టుబట్టి పార్టీలోకి తీసుకొచ్చాను. ఆయనకు ఏమైందో తెలియదు కానీ కాంగ్రెస్లోకి వెళ్లారు. 2018లో విశ్వేశ్వర్ రెడ్డిని ప్రజలు ఓడగొట్టారు. 2018లో రంజిత్ రెడ్డి కొత్త వ్యక్తి అయినా మీరందరూ ఆశీర్వదించి గెలిపించారు. ఇవాళ రంజిత్ రెడ్డి ద్రోహం చేశారు. బయటివాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని మాట చెప్పి.. కవిత అరెస్టు అయినరోజే నవ్వుకుంటా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాన్ని మనం తప్పకుండా తీర్చుకోవాలి. రాజకీయాల్లో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అధికారం పోగానే తమ స్వీయ ప్రయోజనాల కోసం ద్రోహం చేసి పోతున్నారు. చందన్వెల్లిలో రంజిత్ రెడ్డినే పరిశ్రమలు తెచ్చారట. కాలే యాదయ్య, అవినాష్ రెడ్డి సహకారం లేకుండానే పరిశ్రమలు తీసుకొచ్చానని రంజిత్ రెడ్డి అంటున్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఉండదు. మళ్లీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వం. వాళ్లకుండా తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.