కేసీఆర్ను తొక్కుతం, బీఆర్ఎస్ను బొంద పెడతం, గులాబీ జెండా కనబడకుండా జేస్తం అని రేవంత్ చాలా మాట్లాడుతున్నడు. ఒక్కటే చెప్తున్న. రేవంత్.. గతంలో నీలెక్క నీ గురువులు, పెద్ద పెద్ద తీస్మార్ఖాన్లు పిచ్చిమాటలు, ప్రగల్భాలు మాట్లాడిన్రు. వాళ్లంతా పత్తాలేకుండా పోయిండ్రు. నీతోనేమైతది.
-కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జనవరి 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను తొక్కేస్తామన్నోళ్లే ఇప్పుడు పోటీలో లేకుండాపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ పార్టీని వంద ఫీట్ల లోతుకు తొక్కుతాడా? అని సీఎం రేవంత్కు చురకలంటించారు. ‘కేసీఆర్ను తొక్కుతం, బొందపెడతం, గులాబీ జెండా కనబడకుండా జేస్తం అని చాలా మాట్లాడుతున్నడు. గతంలో నీ లెక్క పిచ్చిమాటలు, ప్రగల్భాలు మీ గురువర్యులు మాట్లాడిండ్రు. ఇంతకు ముందున్న పెద్ద పెద్ద తీస్మార్ఖాన్లు మాట్లాడిన్రు. వాళ్లతోనే కాలేదు. నీతోనేమైది’అని ఎద్దేవా చేశారు. ‘నీ అసంటోళ్లు మస్తుగస్తరు.. పోతరు. కాలం కలిసొస్తే వానపాము సైతం నాగుపాములై బుసలు కొడుతాయి’ అంటూ విమర్శించారు.
‘రాహుల్గాంధీ భారత్ జోడో అంటుంటే దేశమంతా కాంగ్రెస్ చోడో అంటున్నది. ఆ పార్టీలోని నేతలు ఎక్కడోళ్లు అక్కడికెళ్లుతున్నరు. కేంద్రం లో బీజేపీకి చెక్పెట్టే శక్తి కాంగ్రెస్కు లేదు. దమ్ము, ధైర్యం తెగింపు, సత్తా అంతకన్నా లేదు. బీజేపీ, మోదీని ఆపాలన్నా.. నిలువరించాలన్నా.. బలమైన నాయకులన్న ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం’ అని స్పష్టం చేశారు. కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్లాంటి నాయకులకు ఓట్లేస్తేనే బీజేపీని ఆపగలుగుతామని చెప్పారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై అనురించాల్సిన వ్యూహంపై కార్యకర్తలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని ఒక్కటవుతున్నాయని, ప్రజలు గమనించాలని సూ చించారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, రేవంత్ ఢిల్లీకి వెళ్లి అమిత్షాను కలిసి వేర్వేరుగా ఎన్నిక లు జరిపేలా కుట్ర పన్నారని ఆరోపించారు. ఒకేసారి నిర్వహిస్తే ఒకటి కాంగ్రెస్, మరొకటి బీఆర్ఎస్ గెలిచేదని తెలిపారు. రెండుపార్టీల కుట్రల వల్ల రెండు స్థానాలు కాంగ్రెస్ గెలిచిందని, ఇది కాంగ్రెస్, బీజీపీల మధ్య పెవికాల్ బంధం అంటూ విమర్శించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను క్యాబినెట్ తీర్మానించి పంపితే తిరస్కరించిన గవర్నర్.. కోదండరాం పేరు పంపితే సంతకం చేశారని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి స్పీకర్ ఏకగ్రీవం కావడానికి సహకరించామని, ఆ ఇంగితం తమకు ఉన్నదని తెలిపారు. తెల్లారి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఓ కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిన మాటలకన్నా హీనంగా ఉన్నదని, ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు.
పదేండ్లు కేసీఆర్ తెలంగాణను నాశనం పట్టించారని, అప్పులపాలు చేశారని, రాష్ర్టాన్ని దివాలా తీయించారంటూ మాట్లాడారని మండిపడ్డారు. ఆర్థికశాఖ శ్వేతపత్రంపై హరీశ్రావు, తాను, విద్యుత్తు శాఖపై జగదీశ్రెడ్డి తిప్పికొట్టామని చెప్పారు. కేసీఆర్ పంపిన ముగ్గురు సైనికులం గట్టిగా తిప్పికొట్టామని, కేసీఆరే అసెంబ్లీకి వస్తే ఎట్లుంటదో ఆలోచించాలని అన్నారు. అధికారంలోకి వస్తామని వారికే నమ్మకం లేక కాంగ్రెసోళ్లు చార్సౌ బీస్ హామీలిచ్చారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసి గెలిచిపోతాడనుకుంటుండు.. నేను డిసెంబర్ 9నాడు రెండు లక్షలు మాఫీ చేస్తా’ అన్న రేవంత్ ఇంతవరకూ చేయలేదని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సుల సంఖ్యను పెంచాలని, అద్దె బస్సుల అద్దెను పెంచాలని డిమాండ్చేశారు. 6 గ్యారెంటీలు అని చెప్పి 13 గ్యారెంటీలు ఇచ్చారని, అవి అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టంచేశారు.
‘ఐదేండ్ల కాలంలో ఓ బడి తేలే.. ఓ గుడి తేలే. నేతన్నకు, గీతన్నకు, రైతుకు చివరికి ప్రజలకు పనికొచ్చే ఒక్క పనిచెయ్యలేదు’ అంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెల్లారితే కేసీఆర్ను తిట్టుడు, అమిత్షా చెప్పులు మోసుడు తప్ప కరీంనగర్ ఎంపీగా ఆయన చేసిందేమిటని నిలదీశారు. ఈ ఐదేండ్ల కాలంలో ఆయన చేసిన పనేంటో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఎంపీగా బండి విఫలమయ్యారని విమర్శించారు. ఎంపీ ల్యాడ్స్ రూ.5 కోట్లుంటే సంజయ్ అయిదు పైసలన్న తేలేదని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్లో ఓటు అడిగే హక్కు బండికి లేదని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని కార్యకర్తలకు సూచించారు. సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ కావాలని తాను వినోద్కుమార్తో కలిసి పదిసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కరీంనగర్ ఎంపీగా ఉండి కూడా సిరిసిల్ల, జమ్మికుంటలో ఉన్న నేతన్నల కోసం బండి సంజయ్ ఒక్క పథకం తేలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారం పోయిందని ఆగంకావొద్దని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని చెప్పారు. వంద స్పీడుతో ఇరవైనాలుగున్నరేండ్లు ఉరికామని, సర్వీసింగ్ అవసరం పడదా? అని అన్నారు. తప్పకుండా మళ్లీ మనమే వస్తామని, ప్రజలు మనదగ్గరకే వస్తారని చెప్పారు. ప్రజలు మనల్ని తీసి అవతల పారేయలేదని, 119 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానా లు అంటే మూడో వంతు ఇచ్చారని, 14 స్థానాల్లో కేవలం నాలుగైదు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయామని తెలిపారు. అందులో సగం గెలిచినా అధికారంలోకి వచ్చేవాళ్లమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 39.8%, బీఆర్ఎస్కు 37% ఓట్లు రాగా, 1.8 శాతం తేడా మాత్రమే ఉన్నదని అన్నారు. ఈ ఏడాదంతా మనకు ఎన్నికలున్నాయని, పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తేనే గట్టి పునాది పడుతుందని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తానని చెప్పారు.
సాధ్యంకాని హామీలిచ్చి సామాన్య ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. పదేండ్లలో కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినం అని రైతులు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్కు గిరిజనులు, పేదలపై ఉన్న ప్రేమతో 33 జిల్లాలు చేసి, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లాలను కుదించాలన్న కాంగ్రెస్ సర్కారు కుట్రలను తిప్పికొడుతామని హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతిపక్షపార్టీకే ఎక్కువ పనులవుతాయని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
‘నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు.. ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాకూర్కు రూ.50 కోట్లు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి తెచ్చుకున్నవ్. ఎన్నటికీ, ముమ్మాటికీ కేసీఆర్ కాలిగోటికి కూడాసరిపోవు’ అంటూ రేవంత్రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. తాను వేరే ఉద్దేశంతో అనడం లేదని, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ ఎక్కడిది? రాష్ర్టానికి వచ్చే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదువులు ఎక్కడివి అని? ప్రశ్నించారు.
ప్రాజెక్టులపై అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. వచ్చే పంట వరకు రైతు భరోసా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ అటోవాలాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినోళ్లంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. ఓటు వేయలేదన్న సాకుతో నేతన్నలపై కక్షసాధింపులకు పాల్పడితే 39 మంది పార్టీ ఎమ్మెల్యేలం కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నేతన్నలకు అండగా ఉండి వారికి వచ్చే సంక్షేమ పథకాలు అమలయ్యేదాక పోరాడుతామని చెప్పారు.
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్లను వదలబోనని, మీ అన్నగా, మీ తమ్ముడిగా అండగా ఉంటానని కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటానని పునరుద్ఘాటించారు. అధికారం పోయిందన్న నెపంతో తాను సిరిసిల్లను వదిలి పోతున్నానంటూ ఈ మధ్య పేపర్లు, టీవీల్లో వస్తున్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. మీ శాసన సభ్యుడిగా మీ కోసం శక్తి మేరకు పనిచేస్తానని, సిరిసిల్ల ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారంపై అసెంబ్లీలో తనగొంతుగా వినిపిస్తానని స్పష్టం చేశారు.