KTR | హైదరాబాద్ : జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక మోసాలు జరుగుతున్నాయి. 2 లక్షలు ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్-1 కింద 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. దాన్ని రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని కొత్త నోటిఫికేషన్ అంటున్నారు. 50 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తమన్నాడు. తాము 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారు. అయితే 50 వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తదని అనుకుంటే.. 5,089 పోస్టులకు అదనంగా మరో 5913 కలిపి 11 వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చిందేమీ లేదు. ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాల మాట తుంగలో తొక్కారు. జాబ్ క్యాలెండర్ అతిగతి లేదు. 4 వేల నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క పచ్చి అబద్దం చెప్పారు అని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలకు రూపాయి కూడా ఫీజు తీసుకోనని రేవంత్ అన్నాడు. టెట్ ఫీజును 400 నుంచి 2 వేలు చేశాడు. ఇది వాస్తవం. ఇంకో దారుణం ఏంటంటే.. మేం కష్టపడి పరిశ్రమలు తెస్తే..వాటిని రేవంత్ పాతరేస్తున్నాడు. ఫార్మా సిటీ పేరిట 12 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాల సృష్టికి రంగంమంతా సిద్దం చేస్తే దానిని కూడా రేవంత్ రద్దు చేశారు. ఫార్మా సిటీని పక్కనపెట్టి.. రియల్ ఎస్టేట్ చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.