KTR | ఆదిలాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో టెట్ ఫీజు రూ. 400 పెడితే.. ఇంత ఎక్కువ పెడుతారా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే టెట్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. కానీ ఇవాళ టెట్ ఫీజు రూ. 1000 చేశారు. ఇంకా ఎంత పచ్చి మోసం చేసిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 5 వేల డీఎస్సీ ఉద్యోగాలకు మరో 5 వేల ఉద్యోగాలు కలిపి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడేమో ఇది దగా డీఎస్సీ.. మెగా డీఎస్సీ కాదు అని రేవంత్ అన్నారు. 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించారు. ఇవాళ 5 వేలకు మరో 5 వేలు కలిపి పది వేలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇది దగా డీఎస్సీ కాదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. గ్రూప్-1 కింద 500కు ఇంకో 60 కలిపి 560 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల మాటలేమో ఆకాశంలో.. చేతలేమో పాతాళంలో. తెలంగాణ ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు కాంగ్రెసోళ్లు అని కేటీఆర్ మండిపడ్డారు.