నల్లగొండ ప్రతినిధి, మే 24(నమస్తే తెలంగాణ)/ యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడబిడ్డలకు తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కే తారకరామారావు విమర్శించారు. ఆరు నెలల్లో లక్షన్నర పెండ్లిళ్లు జరిగాయని, ఈ లెక్కన ఆడబిడ్డలకు రేవంత్రెడ్డి లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నారని చెప్పారు. గత ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిటో పట్టభ్రదులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆయా సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి అని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 6 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి లాంటి ఇంద్రజాలికుడిని ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు.
నోటిఫికేషన్లు లేవు.. రాత పరీక్షలు లేవు.. కానీ, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని దొంగ మాటలు చెప్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి వాటిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకోవడం రేవంత్రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేశారని రేవంత్రెడ్డి అని దుయ్యబట్టారు. ‘ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని చెప్తారా? దివాలా తీసిందని అంటారా? ఇట్లా మాట్లాడితే రాష్ర్టానికి పెట్టుబడులు వస్తా యా?’ అని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలకు రేవంత్రెడ్డి గాడిదగుడ్డునే చేతిలో పెట్టడం ఖాయమని హె చ్చరించారు. జీవో 46 ఇబ్బందులను అప్పటి మంత్రి జగదీశ్రెడ్డి తమతో చర్చించారని, అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది అలాగే మిగిలిపోయిందని చెప్పారు. జీవో 46పై ప్రభుత్వంపై కొట్లాడేందుకు తమ ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకంపై అబద్ధాల ప్రచారం
తెలంగాణలో పదేండ్ల నిజం ఒకవైపు, ఆరు నెలల అబద్ధాల హామీలు మరోవైపు ఉన్నాయని అని కేటీఆర్ వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించి ఫ్లోరైడ్ను రూపుమాపారని గుర్తుచేశారు. వెయ్యేండ్లు గుర్తుండి పోయేలా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం తెలంగాణలో అమలవుతున్నదంటూ రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.
ఇటు బిట్స్ పిలానీ, అటు పల్లీ బఠాణీ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో ఇటువైపు బిట్స్ పిలానీ, అటువైపు పల్లీ బఠాణీ ఉన్నారని, ఎవరు కావాలో పట్టభద్రులే నిర్ణయించుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి ఉన్నత విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్ట్ కాగా, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 56 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 74 రోజులు చంచల్గూడ జైలు జీవితం గడిపారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో పట్టభద్రులు ఆలోచించి ఓటేస్తే కాంగ్రెస్కు మొదటి హెచ్చరిక చేసినట్టు అవుతుందని పిలుపునిచ్చారు. శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి కానీ, ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదని చెప్పారు. ఏనుగుల రాకేశ్రెడిని గెలిపిస్తే నిరుద్యోగుల, విద్యార్థుల, ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తారని చెప్పారు. తీన్మార్ మల్లన్న గెలిస్తే.. దందాలు, బ్లాక్మెయిలింగ్స్ తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని స్పష్టంచేశారు.
తీన్మార్ మల్లన్నతో కోమటిరెడ్డి బ్రదర్స్కు కొత్త భయం: జగదీశ్రెడ్డి
తీన్మార్ మల్లన్న తమ పదవులకు ఎక్కడ ఎసరు పెడతాడోనన్న భయం కోమటిరెడ్డి బ్రదర్స్కు పట్టుకున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో ఇద్దరినీ యూట్యూబ్ చానల్లో ఇరుకున పెట్టిన చర్రిత మల్లన్నదని గుర్తుచేశారు. అలాంటి బ్లాక్మెయిలర్ చేతికి ఆయుధమిస్తే సమాజానికి ప్రమాదమని హెచ్చరించారు. అందుకే నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు, అమ్మాయిలకు స్కూటీ ఇవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక సెల్ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. ఇది చేతగాని, పనిచేయలేని, మోసకారి ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ఆయా సమావేశాల్లో జెడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, అంజయ్య, చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, చెరుకు సుధాకర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్ పాల్గొన్నారు.