KTR | వికారాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది అని కేటీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో బీజేపీ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. చేవెళ్ల, మల్కాగ్జగిరి, నల్లగొండ, వరంగల్లో మన పార్టీకి చెందిన వారినే బీజేపీ నాయకులు అభ్యర్థులుగా ప్రకటించారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఒక్కరే ఒరిజినల్ బీజేపీ. కాబట్టి మన నేతలతోనే మనకు పోటీ నెలకొంది. బీజేపీకి అభ్యర్థులు లేరు.. కేడర్ దిక్కు లేదు అని కేటీఆర్ తెలిపారు.
ఈ దేశంలో మోదీ హవా అంత బాగుంటే.. ఇతర పార్టీల నుంచి నాయకులను ఎందుకు తీసుకెళ్తున్నారు.. చిన్న కార్యకర్తను పెట్టిన గెలవాలి కదా..? ఇవాళ మాట్లాడితే రాముడికి దండం పెడుదాం.. మోదీకి ఓటు వేద్దాం అని అంటున్నారు. హిందువులం కాబట్టి తప్పకుండా దండం పెడుతాం.. కానీ ఓటు వేసే ముందు చేవెళ్లకు బీజేపీ ఏం చేసిందని ఆలోచించి ఓటు వేయాలి. రైలు లైన్ ప్రకటించారా..? ఒక ఫ్యాక్టరీ పెట్టిండా..? ఏదీ లేదు. ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసి పిల్లల నోట్లో మట్టి కొట్టినందుకు మోదీకి ఓటు వేయాల్నా..? అని ప్రశ్నించారు.
ఈ పదేండ్లలో పేదలకు మోదీ చేసిందేమీ లేదు.. కాబట్టి దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది. మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, ఇంజినీరింగ్, నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. అలాంటి దిక్కుమాలిన పార్టీకి ఓటు వేయాల్నా..? రైతుల ఆదాయం డబుల్ కాలేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నడు ఇవ్వలేదు. పెట్రోల్ డిజీల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాల్నా..? పప్పు, నూనె, చింతపండు పిరం చేసినందుకు ఓటు వేయాల్నా..? నిత్యావసరల ధరలు పెరిగాయి.. కాబట్టి మోదీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని.. రాముడి బొమ్మకు మొక్కుతాం.. కానీ చేవెళ్లలో బీజేపీని పండబెట్టి తొక్కుతాం అని చెప్పండి అని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.