KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కడిగి పారేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను భర్తీ చేశానని రేవంత్ చెప్పుకోవడం సిగ్గు చేటుగా ఉందన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ దొంగ మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేనిచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఎల్బీ స్టేడియంలో కాగితాలు ఇచ్చి కేసీఆర్ను తిట్టాలి. 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని బిల్డప్ ఇవ్వాలి. ఇది రేవంత్ రెడ్డి కామన్సెన్స్ ముచ్చట. నాకు తెల్వక అడుగుతున్నాను. పిల్లలు పుట్టాలంటే మొదలు లగ్గం కావాలి.. సంసారం చేయాలి.. ఆ తర్వాత పిల్లలు. మరి నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తివి. ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తివి. నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావంటే సమాధానం లేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని దొంగమాటలు చెప్తావు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే 30 వేల ఉద్యోగాలు. కోర్టు కేసుల కారణంగా ఉద్యోగాల భర్తీ ఆలస్యమైంది. ఇప్పుడు కేసులు పరిష్కారం కావడంతో.. ఆ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్బాగ్య ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
ఏప్రిల్ 13వ తేదీన ప్రతి గులాబీ సైనికుడు కేసీఆర్ మీటింగ్కు భారీగా తరలిరావాలి. తుక్కుగూడ మీటింగ్ తేలిపోయేటట్టు.. మన సభ ఉండాలి. మీటింగ్ సూపర్హిట్ చేసి కాసాని గెలిచిపోయిండు అనే వాతావరణం తీసుకురావాలి. చేవెళ్లలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా కోసం పని చేశారు. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ ఎన్నికల్లో మీ కోసం తిరుగుతాం. గెలిపించుకుంటాం. పది మంది సభ అయినా, వెయ్యి మంది సభ అయినా మీ కోసం వస్తాను. సైలెంట్గా పని చేసుకుంటూ ముందుకు పోదాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అని కేటీఆర్ అన్నారు.