KTR | నల్లగొండ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థితో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మిగతా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఎసరు తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెల్లారి లేస్తే బూతులు, పెద్ద వాళ్లను తిట్టడం, బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం కాంగ్రెస్ అభ్యర్థి పని. ఆయనపై 56 కేసులు ఉన్నాయి. ఇవి ఆయన గుణగణాలు.. మరి బిట్స్ పిలానీలో చదివి సమాజం మీద అవగాహన ఉన్న విద్యావంతుడికి పట్టం కడుతారా..? బ్లాక్ మెయిలర్కు పట్టం కడుతారా…? అనేది పట్టభద్రులు ఆలోచించుకోవాలి. ఈ ఎన్నికతో ప్రభుత్వం కుప్పకూలేదేమీ లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడు కావాలి. మండలిలో బాకా ఊదేటోళ్లు ఉండొద్దు. ప్రభుత్వం భాజా బజాయించి గొంతు విప్పి ప్రశ్నించేటోళ్లు, నిలదీసేటోళ్లు కావాలి అని కేటీఆర్ అన్నారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇలాంటి చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే.. రేపు మీకే ఎసరు పెడుతారన్న మాటను కూడా వారు గుర్తుంచుకోవాలి. సమాజానికి పట్టిన చీడపురుగులు, బ్లాక్ మెయిలర్లను, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రకంటించింది అని కేటీఆర్ ప్రశ్నించారు.