హైదరాబాద్ : ఓటు తమకు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను బెదిరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉపఎన్నికలో పంచి గెలవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని రేవంత్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు.
బుధవారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తమ అసమర్థతను అప్పులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ను ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారన్నారు. ఇటీవల గణేష్ నిమజ్జనానికి వెళ్లిన సీఎం రేవంత్ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదన్న కేటీఆర్.. ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయ్యారనడానికి అదే నిదర్శనమని చెప్పారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్లో చేరలేదన్న అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. హైడ్రా తన ఇల్లు కూలగొడుతుందన్న భయంతో కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకుందని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టే అని హెచ్చరించారు. డబ్బున్న పెద్దల జోలికి హైడ్రా పోదన్న కేటీఆర్.. దుర్గంచెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ముందా..? అని ప్రశ్నించారు.
అధికారం ఉందన్న అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. కారు గర్తుకు ఓటేసి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలని జూబ్లిహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీని పెద్దన్నలా భావించి ఆయన మార్గదర్శనంలో నడుస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే సత్యాన్ని మైనార్టీలు ఇప్పటికైనా గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్గాంధీ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ, మోదీ, సీబీఐ లాంటి అంశాల్లో కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్కు ఓటేస్తే నరేంద్ర మోదీకి, బీజేపీకి వేసినట్టే అని కేటీఆర్ అన్నారు. గడిచిన పదేళ్లలో మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని మోసం చేయడంతోపాటు షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిందని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క మైనార్టీ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ అందించలేదన్నారు.
రూ.4000 కోట్ల మైనార్టీ బడ్జెట్ ఇస్తామని కాంగ్రెస్ సర్కారు ఇవ్వలేదని, కాని పదేళ్లలో మైనార్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చుపెట్టిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లుగా ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పెన్షన్లు పెంచలేదని, రైతుబంధు ఎగ్గొట్టారని, ఆడబిడ్డలకు నెలనెలా రూ.2,500 ఇవ్వడం లేదని విమర్శించారు. అత్తా కోడళ్ల మధ్య రేవంత్ చిచ్చుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు అబద్దపు హామీల ప్రభావానికి గురై మోసపోయిన ప్రజలు ఇవాళ కాంగ్రెస్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారని చెప్పారు.
తమ ఆసమర్థతకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులను కారణంగా చూపించి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. దివంగత నేత మాగంటి గోపినాథ్ను స్మరించుకున్న కేటీఆర్.. ఎవరూ కోరుకోని ఉపఎన్నిక ఇదన్నారు. గోపినాథ్ హఠాత్తుగా దూరమవుతారని ఊహించలేదని చెప్పారు. తన ఇబ్బందులను గోపినాథ్ ఎన్నడూ తమతో పంచుకోలేదన్నారు. రాజకీయ నాయకుల జీవితాలు బయటికి కనిపించేలా ఉండవన్న సంగతి గోపినాథ్ కుటుంబాన్ని చూస్తే అర్థం అవుతుందన్నారు. జూబ్లీహిల్స్లో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా ఆదుకుని, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గోపినాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారన్న కేటీఆర్.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పరిస్థితి మెరుగ్గా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి బంపర్ మెజార్టీ కోసం కృషి చేయాలన్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని అన్ని సీట్లను గెలిపించి ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలిచారన్న కేటీఆర్.. అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుని, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ నెల 14వ తేదీలోపు ప్రతి ఇంటికి వెళ్లి గోపినాథ్ చేసిన పనులు, సేవలను ఓటర్లకు గుర్తుచేయాలన్నారు. బీఆర్ఎస్ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతైతే వెంటనే నమోదు చేయించాలని సూచించారు. యుద్ధంలా పోరాడితేనే విజయం సాధ్యమవుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రహ్మత్ నగర్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పీ విష్ణువర్ధన్ రెడ్డి, కోరుకంటి చందర్, దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతతోపాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.