KTR | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆపద మొక్కులు మొక్కుతున్నాడని, ఇచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థ నాయకుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయన ఒట్లను వింటున్న దేవుళ్లు భయంతో పారిపోతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు.
రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్ పేర్కొన్నారు. తాను ఇంఛార్జ్ ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని రేవంత్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులవి చిల్లర, ఉద్దెర మాటలు. ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఎవరి ఖాతాలోకి చేరలేదు. రూ. 500 బోనస్, నాలుగు వేల పెన్షన్, రైతు కూలీలకు రూ. 12,000, కౌలు రైతులకు రైతు భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వీటిలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. ప్రజలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని అర్థమైంది. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలి. దేవుళ్ళ సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆగస్ట్ 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు అని కేటీఆర్ గుర్తు చేశారు.