మొయినాబాద్, జూన్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో ఆత్మబలిదానం చేసుకున్న యాదిరెడ్డి త్యాగానికి వెలకట్టలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం అసువులుబాసినవారి కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన యాదిరెడ్డి కుటుంబాన్ని ఆదివారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి కేటీఆర్ పరామర్శించారు. తల్లి చంద్రమ్మ, సోదరుడు ఓంరెడ్డి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. యాదిరెడ్డి చిత్ర పటంపై పూలు వేసి నివాళులర్పించారు. తన మనుమరాలికి గొంతు సమస్య ఉన్నదని, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని చంద్రమ్మ వివరించగా వైద్య ఖర్చులను పార్టీ తరఫున అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తేవాలని ఆమె ఫోన్ నంబర్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదిరెడ్డి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 500 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చిందని తెలిపారు.