KTR | నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెయిలైంది మన నాయకుడు కాదు.. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి మనం తీసుకెళ్లలేకపోయాం. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన నల్లగొండ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తుంగతుర్తి, సూర్యాపేటలో కేసీఆర్ పర్యటన సందర్భంగా జనంలో ఆ ఎమోషన్ చూస్తుంటే.. అసలు నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందనేది అర్థం కాలేదు. ఓటమి గల కారణాలపై ఈ వంద పది రోజుల్లో వేల మందితో కూర్చొని మాట్లాడుకున్నాం. ఏం జరిగిందని విశ్లేషించుకున్నాం. నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ సభలకు హాజరైనప్పుడు.. ఆ జనాన్ని చూసి బీఆర్ఎస్ గెలుస్తుందని నమ్మాం. ర్యాలీలు, సభలకు వచ్చిన జనాలను, వారి ఉత్తేజాన్ని చూసిన తర్వాత నల్లగొండలో 12 లో 8 సీట్లు గెలుస్తామన్న విశ్వసాంతో ఉన్నాం. కానీ ఫలితాలు దానికి భిన్నంగా వచ్చాయన్నారు కేటీఆర్.
తన మిత్రుడు భూక్యా జాన్సన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపు 45 నియోజకవర్గాల్లో ఓయూకు చెందిన 20 మంది విద్యార్థులతో సర్వే చేయించారు. ఆ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. మనం తప్పకుండా పార్టీ కుటుంబ సభ్యులుగా కేసీఆర్ బిడ్డలుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. మొన్న జరిగిన పొరపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకూడదు. పని చేసుకుంటూ వెళ్లిపోయాం.. కానీ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో ఒక లక్షా 60 వేల 283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ దేశంలో ఈ పదేండ్లలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా వాళ్ల మనసు గెలుచుకోవడంలో విఫలమయ్యాం. కేసీఆర్ పాలనలో ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు నేనే ఇచ్చానని రేవంత్ రెడ్డి ఊదరగొడుతూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. పరీక్ష పెట్టలేదు. ఈ అబద్దాలను ప్రజలకు, యువతకు వివరించాలి. మనం ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం. అయితే లంబాడీ తండాల్లోని కొంతమంది నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రాలేదు చెప్పారు. పెన్షన్లకు ఆశపడి ఓటు వేయకండి.. తమకు ఉద్యోగాలు వస్తే తామే అంతకు ఎక్కువ ఇస్తామని చెప్పి వృద్ధుల కాళ్లు మొక్కి ఓట్లు వేయించారు నిరుద్యోగులు. మరి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పడంలో విఫలమయ్యాం. ఇక గృహలక్ష్మి అనే పథకం ఎన్నికలకు ఏడాది ముందే అమలు చేసి ఉంటే.. ఓట్లు పడేవి అని విద్యార్థులు పేర్కొన్నట్లు సర్వేలో తేలినట్లు కేటీఆర్ చెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతం పెంచిన నాయకుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చాం. కానీ ఉద్యోగులకు దూరమయ్యాం. ఒకటో తేదీన జీతం రాలేదని చెప్పి ఓట్లు వేయలేదు. కరోనాతో పాటు ఇతర సమస్యల వల్ల ఆర్థికంగా వెనుకబడ్డామని చెప్పడంలో విఫలమయ్యాం. రైతులకు కూడా దూరమయ్యాం. అలా ఏదో ఒక కారణంతో ఆయా వర్గాల ఓటర్లకు దూరమయ్యామని కేటీఆర్ తెలిపారు.
ఎన్నో ఏండ్లుగా ఉన్న ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టాం. ఫ్లోరోసిస్ కాంగ్రెస్ ద్రోహామేనని ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. నల్లగొండ జిల్లాకు పదేండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్పడంలో విఫలమయ్యాం. ఫెయిలైంది మన నాయకుడు కాదు.. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. మనమేమో ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. ప్రజలేమో అబద్దాలకు మోసపోయారు. పదేండ్ల నిజం ముందు ఈ వంద రోజుల అబద్దం ప్రజలకు ఇవాళ కనబడుతుంది. ఏ ఊరికి మన నాయకులు పోయినా ఇట్ల అయితదని అనుకోలేదు. ఇంత మోసం జరుగుతుది అనుకోలేదని. ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు.
కేసీఆర్ సార్ మళ్లీ నువ్వ రావాలి. నువ్వున్నప్పుడే మంచిగ బతికినం అని ఓ రైతు కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ పాలన ప్రజలకు అర్థమైంది.. మనకు అర్థం కావాలి. మనం గట్టిగా పని చేస్తే ఫలితం వస్తుంది. 2018లో జిల్లా మొత్తంలో 12కి 11 గెలిచాం. నల్లగొండ పార్లమెంట్లో 6 గెలిచాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఓడిపోయాం. ఇప్పుడు 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఎంపీ నియోజకవర్గాల్లో ఎందుకు ఓడదో ఆలోచించి పని చేయండి. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలను ప్రజలను సునిశితంగా గమనిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.