ఫోన్ ట్యాపింగ్పై నీకు సత్తా ఉంటే, నీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆధారాలతో సహా కోర్టుముందు నిలబెట్టు. తప్పు చేసినవాడిని శిక్షించు. ప్రభుత్వం నీది కదా? నిన్నెవడు ఆపుతున్నాడు?
-కేటీఆర్
KTR | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి, ఇతర కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైతే నార్కో, లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి తనతోపాటు లై డిటెక్టర్, నార్కో అనాలసిస్ పరీక్షకు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం ఒక న్యూస్ చానల్ నిర్వహించిన ‘క్రాస్ఫైర్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి తన మంత్రివర్గంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు తన ఫోన్ ను, ఇతర ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ట్యాప్ చేయడం లేదని చెప్పే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్రెడ్డికి లేదని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ప్రతిపక్ష నాయకుడి ఫోన్లను పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్రం ట్యాప్ చేయిస్తున్నదని ఆరోపించారు. అలా చేయడం లేదనే దమ్ము, ధైర్యం కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉన్నదా? అని ప్రశ్నించారు.
నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడిన మాటలను టీవీ స్టూడియో వేదికగా కేటీఆర్ ప్రసారం చేశారు. 2010 మేలో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివరాలు వెల్లడించారు. 9 వేల కాల్స్, మెయిల్స్ 2013లో ఎలా ట్యాప్ చేశారో వివరించారు. కిరణ్కుమార్రెడ్డి ప్రభు త్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్లను టాప్ చేస్తున్నదని నాడు పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారని గుర్తుచేశారు.
‘ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదని నిరూపించుకునేందుకు గన్పార్క్ అయినా, మరేదై నా బహిరంగా వేదికమీదైనా నేను చర్చకు సి ద్ధం. మీరు లైడిటెక్టర్ పరీక్షను ఓపెన్గా లైవ్ టీవీలో పెట్టండి. అది వద్దనుకుంటే నార్కో అనాలసిస్ అయినా ఫర్వాలేదు. ఈ రెండు పరీక్షలకు మీరు ఎక్కడికి, ఎప్పుడు రమ్మంటే నేను సిద్ధం. నాకు ఏ ట్యాపింగ్తో సంబంధం లేదు. కాంగ్రెస్ నుంచి రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి కిషన్రెడ్డి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలముందు నా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఏ పరీక్షకైనా సిద్ధం. మీరు సిద్ధమేనా?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
‘ప్రతి ప్రభుత్వంలో ఉన్న నిఘా వ్యవస్థలు సంఘ విద్రోహ శక్తులను నిరోధించడానికి ట్యాపింగ్ చేస్తుంటాయని, అయితే, ఇట్లాంటి వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవ్వరైనా శిక్షార్హులేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడకముందు ఎన్నో దుర్ఘటనలు జరిగాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ఘటనైనా జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ మీడియాకు లీకులు ఇస్తున్న లీకువీరుడికి ఈ అంశం మీద ప్రెస్మీట్ పెట్టే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్క అధికారిక ప్రకటనైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తే.. ఎవరు, ఎలా, ఎప్పుడు చేశారో ఆధారాలతో సహా కోర్టులో చెప్పాలని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి ఒకనాడు డీజీపీగా ఉన్నారని, ప్రస్తుత డీజీపీ రవిగుప్తా హోం సెక్రటరీగా పనిచేశారని, ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్రెడ్డి నాడు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారని, సజ్జనార్ ఎస్ఐబీ చీఫ్గా పనిచేశారని, అయితే వీళ్లందరి పాత్ర కూడా ఉన్నదా? వీళ్లకేం తెలియకుండానే జరిగిందా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్కు చెందిన ఒక సామాజికవర్గాన్ని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు.
తనకు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదని చెప్తుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి సొల్లు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఏ తప్పూ చేయని నేనెందుకు భయపడాలి? అందుకే వారికి లీగ ల్ నోటీసులు ఇచ్చా. పరువునష్టం దావా వేశా. బాధ్యతల్లో ఉ న్నవాళ్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా? నాకూ కుటుంబం ఉన్నది, పిల్లలు ఉన్నారు. తప్పు చేయలేదని చెప్పడానికి నిప్పుల మీద నడవాలా?’ అని ప్రశ్నించారు. ఈ కేసులో నిజంగా ఆధారాలు ఉంటే రేవంత్రెడ్డి బయటపెట్టాలని, నిందితులను శిక్షించాలని పేర్కొన్నారు. ఎన్నిరోజులు ఇంకా ఈ దాగుడుమూతలు అని ప్రశ్నించారు. వందరోజుల్లో ఏ పనులు చేయలేదు, టాపిక్ డైవర్ష న్ కోసం ఫోన్ ట్యాపింగ్ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ చేయలేక, నీళ్లు, కరెంటు ఇచ్చే దమ్ములేక పీఆర్ స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి బాటలు వేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసమే డమ్మీ అభ్యర్థులను నిలబెడుతున్నారని, వాటిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, కరీంనగర్ వంటి పలు నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్నదని చెప్పారు. బీజేపీ ఓటు కోసం రాముడిని అడ్డం పెట్టుకుంటున్నదని విమర్శించారు. రాజకీయాల్లో కుల, మతాల ప్రభావం ఉండదని చెప్పారు.
తన పాలనపై నమ్మకం లేని సీఎం రేవంత్రెడ్డి, తన మంత్రివర్గంలోని మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘రేవంత్రెడ్డి తన మంత్రివర్గంలోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి, ఉత్తమ్ ఫోన్లతోపాటు ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారా? లేదా? అనేది లై డిటెక్టర్ టెస్టులో చెప్పాలి. ఆ ధైర్యం రేవంత్రెడ్డికి ఉన్నదా? లై డిటెక్టర్ టెస్టుకు నాతోపాటు కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి రావాలి. ముగ్గురం ఒకేచోట కూర్చుందాం. కడిగిన ముత్యంలా బయటికి వస్తా. నేనేం తప్పు చేయలేదు కాబట్టి, నాకు ఆ విశ్వాసం ఉన్నది. వారిద్దరికీ అదే విశ్వాసం ఉంటే వారు కూడా టెస్టు చేయించుకోవాలి’ అని సవాల్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 నుంచి 12 ఎంపీ స్థానాలు కచ్చితంగా గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎజెండానే తెలంగాణ అని, తెలంగాణ చుట్టూనే తమ పార్టీ రాజకీయం ఉంటుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా భద్రంగా, బ్రహ్మాండంగా ఉంటుందని, తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు పూర్వవైభవం తెచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, అనేకమంది నాయకులను తయారుచేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతంలో బలంగా ఉన్నదని తెలిపారు.