KTR | కామారెడ్డి : అసంబద్ధ హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు అని రేవంత్ రెడ్డి టీవీల్లో చెప్పారు. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు.. ప్రజలు కోరుకునేది మేం చేస్తాం అని రేవంత్ చెప్పిండు. ఆయన నిజాయితీగా చెప్పిండు. మోసగాడైనా నిజాయితీగల్ల మోసగాడు రేవంత్ రెడ్డి.. మోసం చేస్తా అని చెప్పిండు మోసం చేసిండు అని కేటీఆర్ పేర్కొన్నారు. గొర్రెలు కసాయిలను నమ్ముతది.. అట్లనే మోసపోయేటేళ్లు మోసం చేసే వాళ్లనే నమ్ముతారు అని తెలిపారు. పొంకనాల పోతిరెడ్డి లాగా ఎన్నో మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. రూ. 2 లక్షల రుణం తెచ్చుకుంటే డిసెంబర్ 9న మాఫీ చేస్తానని పొంకనాల పోతిరెడ్డి నరికిండు. డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9 పాయే.. మార్చి 9 కూడా పీకింది. ఇప్పుడు మనం యాది చేస్తే.. ఏవేవో మాట్లాడుతున్నారు. యాది చేస్తాం.. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే నీ భరతం పడుతాం అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు.
ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం ఇస్తానని రేవంత్ ఎన్నికల సమయంలో చెప్పిండు.. మూడు నెలలు అవుతుంది.. ఇంత వరకు తులం బంగారం ఇవ్వలేదు. ఇప్పటికీ కేసీఆర్ అమలు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. రూ. లక్షనే ఇస్తుండు. బంగారం లేదు.. మన్ను లేదు. వంద రోజులు నిండిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బొంద తవ్వేది ఈ ఆడబిడ్డలే అని చెబుతున్నాను. ఎక్కువ టైం పట్టదు.. మార్చి 17కు వంద రోజుల సినిమా పూర్తవుతది. మహాలక్ష్మి కింద ఇంట్లో కోడళ్లు ఉంటే రూ. 2500 ఇస్తా, అత్తలకు నెలకు రూ. 4 వేలు, వారి భర్తలకు రూ. 4 వేలు ఇస్తా అని చెప్పిండు రేవంత్. మరి మహాలక్ష్మి ఎక్కడికి పోయింది. రైతులకు క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు యాసంగి పంట కోతకు వస్తుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే.. ఎన్నిల కోడ్ వచ్చే లోపు బోనస్ ప్రకటించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.