KTR | హైదరాబాద్ : పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, బుల్డోజర్ పాలన నడుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్ రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటుచేసిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
“తెలంగాణలో రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు అంతా బీజేపీతో కలిసిపోయారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తుంది. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీ టీం అంటున్నాయి,” అని కేటీఆర్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించే రాహుల్ గాంధీకి తెలంగాణలో అదే బుల్డోజర్ పాలన కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. “తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. పేదల ఇళ్లపై బుల్డోజర్ పెడుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదు. రాహుల్ గాంధీ సొంత ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని పొగుడుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్న మౌనంగా ఉంటున్నాడు,” అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లును చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అనే విషయం రాహుల్ గాంధీకి తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. “ఒక్క సంవత్సరంలోనే అపార్ట్మెంట్ల నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో జనరేటర్లు, ఇన్వర్టర్ల పరిస్థితి లేకుండా నిరంతర విద్యుత్ అందించగలిగాము. హైదరాబాద్ నగర ప్రగతి, శాంతి భద్రతలపై అనుమానాలు ఉన్నవాటన్నిటిని తొలగించి అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దాము. శాంతియుతంగా, సోదరభావంతో ప్రతి ఒక్కరూ కలిసి ఉండే విశ్వ నగరాన్ని తయారు చేసే దిశగా విజయం సాధించాము. మత రాజకీయాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేశాము,” అని తెలిపారు. కేసీఆర్ గారి హయంలో మైనార్టీల కోసం 204 గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా సహాయం కింద ప్రత్యేకంగా రూ. 20 లక్షల స్కాలర్షిప్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా విజయవంతంగా వెళ్తున్నారని కేటీఆర్ వివరించారు.
అడ్డగోలు హామీలు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “చదువుకున్న విద్యావంతులు పోలింగ్ రోజు బయటకు వచ్చి సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. రైతు నుండి విద్యార్థి వరకు, మహిళ నుండి ఉద్యోగి వరకు—ఎవ్వరికీ న్యాయం చేయలేదు.సమాజంలోని ప్రతి వర్గం కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాన్ని గుర్తించింది” అని ఆయన అన్నారు. మా పార్టీ 10 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, వారు చేసిన ఎన్నికల హామీల అమలు ద్రోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.