KTR | ఆదిలాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొంత మంది నాయకులు బీఆర్ఎస్ను వీడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ముధోల్, నిర్మల్, కాగజ్నగర్లో పెద్ద నాయకులు పోయారు. అధికారం రాగానే మా వద్దకు వచ్చారు. అధికారం పోగానే మళ్లీ పోయారు. చలిచమీలు కలిసి బలమైన సర్పాన్ని ఎలా చంపుతాయో.. అదే పద్ధతుల్లో ఈ కాంగ్రెస్ అనే విషసర్పాన్ని గులాబీ జెండా కప్పుకున్న చలి చీమలే చావుదెబ్బ కొడుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పోరాడితే.. పక్కాగా గెలుస్తాం. ఆదిలాబాద్లో త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్పై ప్రజలు మంట మీద ఉన్నారు. మొన్న ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. లంబాడా, ఆదివాసీ సోదరులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం. సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకున్నాం. కుమ్రం భీం జల్ జంగల్ జమీన్ అని అంటే దాన్ని ఆచరణలో చేసి చూపించారు కేసీఆర్. ఇంటింటికి నీళ్లు ఇచ్చారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించారు. హరితహారం పేరుతో జంగల్ను కాపాడారు. కుమ్రం భీం ఆశయాలను అలా కేసీఆర్ ముందుకు తీసుకుపోయారు. నాటి ప్రభుత్వాలు కుమ్రం భీంను గుర్తించలేదు, పట్టించుకోలేదు. జోడెన్ఘాట్లో కుమ్రం భీం స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అధికారికంగా జయంతి, వర్ధంతి ఉత్సవాలు నిర్వహించి, నిజమైన నివాళులర్పిచాం. కొత్తగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేసి కుమ్రం బీం పేరు పెట్టి ఆయన ఆశయాలను నెరవేర్చాం అని కేటీఆర్ తెలిపారు.
ఆనాడు ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి వస్తాడు. సిగ్గు లేకుండా, మాటల్లో నిజాయితీ లేకుండా అమరవీరులకు క్షమాపణ చెప్పకుండా గిరిజనులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఇవన్నీ గ్రామాల్లో వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. మే 13న కర్రుకాల్చి వాత పెట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు.. పోయింది అధికారం మాత్రమే.. కార్యకర్తల్లో పోరాట పటిమ తగ్గలేదు. గ్రామాల్లో కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీసీటీ, సొసైటీ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని కేటీఆర్ తేల్చిచెప్పారు.