దేవరుప్పుల, ఏప్రిల్ 14: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడి ఆధ్వర్యంలో దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, ధర్మాపురం, ధర్మగడ్డ తండాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి వర్గానికి చెందిన 30 మంది కాంగ్రెస్ నాయకులు తమను సమావేశానికి ఎందుకు పిలువలేదని, తమను సంప్రదించకుండా తమ గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను ఎలా కాంగ్రెస్లో చేర్చుకుంటారని స్టేజీపై ఉన్న నాయకులను నిలదీశారు. దీంతో ఝాన్సీరెడ్డి, పెద్ది కృష్ణమూర్తి వర్గాల మధ్య చేరికల గొడవ తలెత్తి ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు జోక్యం చేసుకుని పెద్ది వర్గానికి సంబంధించిన నాయకులను బయటకు పంపించారు. పలువురిని పోలీస్స్టేషన్కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది.