సిటీబ్యూరో, ఆగస్ట్ 8 (నమస్తే తెలంగాణ): ఒంటరితనంతో బాధపడుతున్నారా.. మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా.. అదికూడా 50 శాతం ఆఫర్లతో.. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్లతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనక సైబర్ మోసం దాగి ఉందని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. శనివారం తన ఎక్స్ ఖాతాలో అమ్మాయిలూ.. బీ కేర్ఫుల్.. అంటూ పోస్ట్ చేశారు. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది అనీ, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా రెంట్ బాయ్ఫ్రెండ్-యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజిలతో కూడిన పోస్టర్లను సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ ఒక గంట కాఫీ మీటింగుకు రూ.499, సినిమా డేట్కు రూ.1249, షాపింగ్కు తోడుగా రావడానికి రూ. 1499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా రావడానికి రూ.1999, ఇలా కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే ముందుకు తెచ్చారని, ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మ బలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్గా మెసేజ్ చేయాలని కోరుతున్నారని సీపీ తెలిపారు. ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడుతున్నారని, బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి ఆ పై ఆ అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఆన్లైన్ సంభాషణలు విని అపరిచిత వ్యక్తులను నమ్మి నేరుగా కలవడానికి వెళ్తే మీరు ట్రాప్ అయ్యే అవకాశం ఉందని, ప్రేమ పేరుతో అబద్దాలు చెప్పి మోసం చేసే ప్రమాదం ఉంటుందని సజ్జనార్ హెచ్చరించారు. ఈరకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి పెట్టిందని, వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఆఫర్ల విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు సోషల్మీడియాలో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు గమనించి ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే అవకాశముంటే వెంటనే వారిని కట్టడి చేస్తూనే పోలీసులకు సమాచారమివ్వాలని సీపీ సజ్జనార్ కోరారు.