Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగర పరిధిలో ఎంఐఎం గెలిచిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పరిధిని క్లీన్ స్వీప్ చేసింది. మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాలను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల పరంగా కాంగ్రెస్ కంటే వెనుకబడిన బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగు శాతాన్ని పెంచుకొంది.
దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పార్లమెంటు పరిధిలోకి మల్కాజిగిరి, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించింది. అనంతరం 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్రెడ్డి విజయం సాధించారు.
ఆ ఎన్నికల్లో 15,63,646 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా… రేవంత్రెడ్డికి 6,03,748 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 5,92,829 ఓట్లు రావడంతో పదివేల పైచిలుకు ఓట్లతో రేవంత్ గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి గణనీయంగా పుంజుకుంది. ఇక్కడి ఏడు స్థానాలను గులాబీ పార్టీ నిలబెట్టుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 37.91 శాతం ఓట్లను సాధించగా… తాజా ఎన్నికల్లో 9.01 శాతం అదనపు ఓట్లతో 46.92 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో 38.61 శాతం ఓట్లను సాధిస్తే ఇప్పుడు 29.16 శాతం ఓట్లకు పడిపోయింది. బీజేపీ సైతం గతంతో పోలిస్తే స్వల్పంగా తన ఓట్ల శాతాన్ని పెంచుకున్నది.