హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో అరెస్ట్ కావాల్సిన నిందితుడు బండి భగీరథ్ తప్పించుకు తిరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రశ్నించారు. ఇన్ని రోజులైనా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని, రాష్ట్రంలో సామాన్యులకు ఒక న్యాయం, మంత్రి కొడుకుకు మరో న్యాయమా అని నిలదీశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని డీజీపీ సీవీ ఆనంద్ను వారు కలిసి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి హైడ్రామాకు ఫుల్స్టాప్ పెట్టాలని వారు కోరారు. మా జీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మహిళా నాయకులు సామల హేమ, సు నీత, నిరోష, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి తదితరులు డీజీపీకి ఏడు డిమాండ్లతో కూడిన నాలుగు పేజీల వినతిపత్రం సమర్పించారు. అనంతరం కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో వారు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, హోం మంత్రి గా పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. స్టేషన్ బెయి ల్ వచ్చేలా నిందితుడిపై బలహీనమైన సెక్షన్లు పెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీని సపోర్ట్ చేస్తున్నదని, అందుకే పోలీసులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నట్టు తాము భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని, పోక్సో కేసుపై కాంగ్రెస్ మహిళా మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన తప్పుని ఒప్పుకొని తన కొడుకుని వెంటనే సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ వి మర్శించారు. నిందితుడిని కాపాడటం కూడా నేరమేనని, అందుకే ఈ కేసులో సంజయ్ను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశా రు. సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిందితుడి మేనమామకు నోటీసులు ఇచ్చారని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని నోటీసులో పేరొన్నారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా కాంగ్రెస్ మహిళా మంత్రులు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. గతంలో చిన్నచిన్న విషయాలకే స్పందించిన మంత్రి సీతక, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరూ కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడు పరారీలో ఉంటే అతని బంధువులను ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని సునీత ప్రశ్నించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.