భారత రాష్ట్ర సమితి దేశానికి ఒక వెలుగుదివ్వెగా మారబోతున్నదని, జాతీయస్థాయిలో ట్రెండ్ సెట్టర్గా నిలువబోతున్నదని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో వందకు పైగా సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టంచేశారు. గులాబీ పార్టీ 22 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. శుక్రవారం ప్రతినిధుల సభను హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రాధాన్యతలు, భవిష్యత్తు లక్ష్యాలపై ప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నేతలకు బాధ్యతలను గుర్తుచేశారు. ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ సందర్భంగా కీలక రాజకీయ తీర్మానాలను ప్రతినిధుల సభ ఆమోదించింది.
ప్రజలు మనల్నే ఎన్నుకోవాలి
‘ప్రజలు అనుకోకుండా ఎవరినో ఒకర్ని ఎన్నుకోవాలని కాకుండా కచ్చితంగా మనల్నే ఎన్నుకోవాలి’ (ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్) అనే వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. 2014లో తెలంగాణ తొలి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్ల్లో 63 సీట్లు వస్తే.. 2019లో 88 సీట్లు గెలిచాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రజల ఆదరణతో ఈసారి 100 కు పైగా గెలుస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్ కాదు. మునపటి కన్నా ఎకువ సీట్లు రావాలనేది ప్రాధాన్యతాంశం.
2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1.47లక్షలుగా ఉండగా, అదిప్పుడు రూ. 3.17 లక్షలకు చేరుకున్నది. ఇది జాతీయ తలసరి ఆదాయం కన్నా రెట్టింపు. అలాగే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 2,19,518 ఉన్నది. అంటే ఏపీ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా లక్ష రూపాయలు తకువ.
పేదలకు భూములు పంచుదాం
గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి సర్వే నివేదికలను ప్రభుత్వానికి ఇవ్వండి. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా ఉంటే తక్షణమే అర్హులైన పేదలకు పంచుదాం. హైదరాబాద్ నోటరీ భూములనూ క్రమబద్ధీకరిద్దాం. ఇందుకు సంబంధించిన ఫైళ్లపై కొత్త సెక్రటేరియట్లో సంతకం చేస్తా.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో ఘన విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ‘ప్రజలు ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలని కాకుండా కచ్చితంగా మనల్నే ఎన్నుకోవాలి (ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్) అన్న వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. దూపైనప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేటి కాలానికి సరిపోదు’ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కరలేదని అన్నారు. అన్నిస్థాయిల్లోని పార్టీ క్యాడర్లో అసంతృప్త్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పార్టీ ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో మరే రాష్ట్రం చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ చేపట్టిందని.. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, విపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని అంతేబలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ వివరించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. 2014లో 63 సీట్లు గెలిస్తే, 2018లో 88 సీట్లు గెలిచాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రజల ఆదరణతో ఈసారి 100కు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘మరోసారి మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్ కాదు. మునపటికంటే ఎకువ సీట్లు రావాలనేదే ప్రాధాన్యతాంశం కావాలి’ అని స్పష్టంచేశారు. తానే త్వరలో స్వయంగా ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడతానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసిన బీఆర్ఎస్, ప్రగతి పథాన ముందుకు సాగుతున్నదని అన్నారు. అదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశగా బీఆర్ఎస్గా మార్పుచెంది ఒక చారిత్రక దశలోకి ప్రవేశించిందని తెలిపారు. గుణాత్మక రాజకీయాలతో దేశంలో ట్రెండ్సెట్ చేయడం కోసమే బీఆర్ఎస్ ముందుకు వచ్చిందని స్పష్టంచేశారు. దేశానికి బీఆర్ఎస్ ఒక వెలుగుదివ్వెగా మారబోతున్నదని తెలిపారు.
పనితీరుకు గీటురాయి
‘2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.47లక్షలు ఉంటే, ఇప్పుడు రూ.3.17 లక్షలకు చేరుకొన్నది. ఇది దేశ తలసరి ఆదాయానికి రెట్టింపు. ఏపీ తలసరి ఆదాయం రూ.2,19,518 ఉన్నది. మనకన్నా రూ.లక్ష తకువ. ప్రభుత్వ పనితీరుకు ఇదే గీటు రాయి’అని కేసీఆర్ ఉదహరించారు. ‘రాష్ర్టాన్ని ఏలే తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు. మనం చిత్తశుద్ధితో చేపట్టిన కార్యక్రమాల వల్ల తలసరిలో మహారాష్ట్ర, తమిళనాడును దాటాం. తలసరి విద్యుత్తు వినియోగంలో అగ్రస్థానంలో నిలిచిచాం. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద.. ఇలా ప్రతి రంగంలో దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేశాం. 2021-2022కు ముందు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.34 వేల కోట్లు ఉంటే, రూ.44 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. లక్ష్యానికి మించి రూ.54 వేల కోట్లు సాధిం చాం. రోజురోజుకూ ఆర్థిక వనరులు పెరుగుతున్నాయనడానికి జీఎస్టీ వసూళ్లు మంచి ఉదాహరణ. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పూర్తిస్తాయి సాగునీళ్లు వస్తాయి’ అని సీఎం చెప్పారు.
రైతులను చైతన్యం చేయాలి
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మకలు, జొన్నలు సహా అన్ని పంటలను గతంలో మాదిరిగానే కొంటామని చెప్పారు. పంట కొనుగోళ్ల కోసం మార్ఫెడ్కు ఆదేశాలిస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు.
పల్లె నిద్రలు.. బస్తీ నిద్రలు చేయండి
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవటానికి పల్లె నిద్ర, పట్టణాల్లో బస్తీ నిద్ర కార్యక్రమాలు ఉపయోగపడతాయని కేసీఆర్ సూచించారు. బస్తీలవారీగా, వార్డులవారీగా పల్లెలు పట్టణాల్లో నియోజకవర్గాలవారీగా తిరిగి సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సమగ్ర సమాచారంతో, తగిన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎప్పటికపుడు ఈ సమీక్షల నివేదికలు పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. రాబోయే పది రోజుల్లో ప్రజలతో సమీక్ష కార్యక్రమం ముగించాలని స్పష్టంచేశారు.
నోటరీ భూముల క్రమబద్ధీకరణ
హైదరాబాద్ నోటరీ భూములను కూడా క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త సచివాలయంలో ఆ ఫైళ్లపై సంతకం చేస్తానని వెల్లడించారు. రూ.3 లక్షలిచ్చే గృహలక్ష్మి విధివిధానాలు త్వరలో విడుదలవుతాయని చెప్పారు. సొంత జాగాలున్నవారికి, పట్టాలున్నవారికి కూడా ఇండ్లు కట్టిస్తామని వివరించారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయని, సర్వేచేసి నివేదికలు ప్రభుత్వానికి పంపాలని, ఇండ్లు కట్టుకోవటానికి అనువుగా ఉంటే తక్షణమే పేదలకు పంచుదామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో జడ్పీ చైర్మన్లు, ఎంపీలను జిల్లా ఇన్చార్జీలుగా ఉపయోగించుకోవాలని, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు.
పథకాల అమల్లో తేడాలొస్తే కఠిన చర్యలే
గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ, పోడుభూముల పట్టాలు, 58, 59 జీవోల ప్రకారం క్రమబద్ధీకరణ సామాన్యులకు, పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలని కేసీఆర్ అన్నారు. ఈ పథకాల్లో ఎటువంటి తేడాలు వచ్చినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
అపురూపంగా ఆత్మీయ సమ్మేళనాలు
పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ, నియోజకవర్గాలవారీగా సభలు విజయవంతంగా నిర్వహించారని పార్టీ శ్రేణులను, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కేసీఆర్ అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షలమంది ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ‘మనం పనులు బాగా చేస్తున్నం కానీ ప్రచారం లేదని మన శ్రేయోభిలాషులు అంటున్నరు. కనుక చేసిన పనిని చెప్పుకోవాలె. మీరు కూడా నావోతిగనే వుంటెట్ల?’అని ప్రశ్నించారు. ప్రచార సాధనాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. మన ప్రగతి గురించి సానుకూలంగా ఆలోచించే మీడియాను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరమున్నదని చెప్పారు ‘పదేండ్ల పాలనలో ఒకో గ్రామానికి పథకాల రూపంలో ఎన్ని డబ్బులు అందాయి? లబ్ధిదారులకు ఎట్లా అవి ఉపయోగపడుతున్నాయనే విషయంపై దృష్టి సారించాలి. క్యాడర్లో అసంతృప్త్తి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.
విజన్లేని మహారాష్ట్ర
దేశంలో ఇప్పటికీ అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం మహారాష్ట్ర అని సీఎం కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం విషయంలోనే కాదు అసలు ఏ విషయంలోనూ విజన్ లేదని మండిపడ్డారు. ‘తెలంగాణలాంటి పథకాల అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నన్నది. కానీ, తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వస్తున్నారని తెలిపారు. నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభలకు విశేష స్పందన వచ్చిందని సంతృప్తి వ్యక్తంచేశారు.
కేసీఆర్కు కడియం ధన్యవాద తీర్మానం
దళితబంధు పథకం, 125 అడుగుల అంబేదర్ విగ్రహం, సచివాలయానికి అంబేదర్ పేరు, రాష్ట్రంలో గురుకులాల ఏర్పాటు సహా దళితులకోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై తీర్మానాలను ఎమ్మెల్సీ కడియం ప్రవేశపెట్టారు. తీర్మానాలను బలపరుస్తూ సభను ఆమోదించాలని కోరుతూ ఎస్సీ డెవలప్మెంట్శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, గువ్వల బాలరాజు ప్రసంగించారు. తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సైతం తీర్మానాలపైనా స్పందించి ఆమోదించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రతినిధుల సభ క్రమమిది
ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకొన్న సీఎం కేసీఆర్.. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిషరించారు. తర్వాత ప్రతినిధుల సభకు చేరుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. అనంతరం కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. చివరిగా వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టడంతో మొదటి సెషన్ పూర్తయింది. భోజనాల తర్వాత 2:30 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మొదటగా తీర్మానాలను బలపరుస్తూ ప్రసంగించారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్, మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీర్మానాలపై ప్రసంగించి ఆమోదించాలని కోరారు.
కేంద్రం మీద మనకు ఆశలేదు
కేంద్రం చేసే సాయం ‘దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుకలు మొరిగినట్టు’ ఉన్నదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘తెలంగాణ రైతులకు కేంద్రం మీద ఆశలు ఏనాడూ లేవు. అవసరానికి అకరకొచ్చే పరిస్థితి కేంద్రానికి లేదు కాబట్టే రాష్ట్రమే కష్టమైనా నష్టమైనా భరించాలని నిర్ణయించుకున్నది’ అని అన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం ప్రకటించడం దేశంలోనే మొదటిసారి అని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. ‘తెలంగాణ పచ్చబడ్డది.. పల్లెలు సల్లబడ్డయి.. వలసపోయినవాళ్లు తిరిగివస్తున్నారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మాడల్స్ తెప్పిచ్చి మనం ఎలా ముందుకుపోవాలని పరిశీలించా. వాటికంటే తెలంగాణ ముందంజలో ఉన్నది. మన పార్టీ రైతు పార్టీగా మారింది. రైతు రాజ్యాన్ని నడిపించుకుందాం’అని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయరంగం వాటా 23% చేరడం గొప్ప విషయమని అన్నారు.