నాగార్జున సాగర్(నల్లగొండ) : తెలంగాణలో ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) విజయం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ(Mlc) కడియం శ్రీహరి జోస్యం చెప్పారు. మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరిసాగర్ లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గడిచిన 35 ఏళ్లలో మాజీ మంత్రి జానారెడ్డి(Janareddy) నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, 70 ఏండ్లలోనూ ఆయన చేయబోయేది కూడా ఏమీ లేదని అన్నారు. సాగర్ వెనుక బాటుతనానికి జానారెడ్డె కారణమని ఆరోపించారు.గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) గారిదేనని కొనియాడారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని సూచించారు.
‘ తెలంగాణలో బీజేపీ పార్టీకి ఉనికి లేదు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు.కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ’ అని ఎద్దేవా చేశారు.దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు, బీజేపీ 15 ఏళ్లు పరిపాలించినా ఏ మార్పు రాలేదని అన్నారు. ‘తొమ్మిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది.రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమ’ని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి భాష అభ్యంత్యకరమని అన్నారు.దేశంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజయందేర్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.