Harish Rao | సిద్దిపేట, మార్చి 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వడగండ్ల వాన వచ్చి నష్టం జరిగితే రైతులను కలిసి ఓదార్చేందుకు సీఎం, మంత్రులకు తీరికలేకుండా పోయిందని సిద్దిపేట ఎమెల్యే, మాజీమంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తలు, పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం శనివారం శామీర్పేటలోని అరణ్య అతిథిగృహంలో జరిగింది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ వచ్చీపోయే కరెంటుతో మోటార్లు, ట్రాన్సుఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సాగునీరు ఇవ్వడం చేతకావడం లేదని విమర్శించారు. కొత్త పనులు మంజూరు చేయకపోగా, గతంలో మంజూరు చేసిన వాటిని రద్దుచేయడం ఈ సీఎంకే చెల్లించదని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లాలో రూ.150 కోట్ల విలువైన పనులు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన వారిని ఎక్కడికక్కడ నిలదీయాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. రద్దుచేసిన పనులపై గ్రామాల్లో చర్చ పెట్టి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఇకపై ప్రాణం అడ్డుపెట్టి అయినా కార్యకర్తల వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. భూములు కబ్జాచేసిన వారు మాత్రమే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో ఎవరినీ వేధించలేదని, ఎవరికీ వీసమెత్తు అపకారం చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టారని, 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని 10 ఏండ్లలో చేసి చూపించిన నేత కేసీఆర్ అని హరీశ్రావు ప్రశంసించారు.
‘రాజ్యసభ సభ్యుడు కేశవరావుకు ఏం తక్కువ చేశాం. రాజ్యసభ పదవి ఇచ్చాం. ఆయన కుమార్త్తెకు హైదరాబాద్ మేయర్ పదవి, కుమారుడికి చైర్మన్ పదవులు ఇచ్చాం. కేసీఆర్ ఆయనకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో మీ అందరికీ తెలుసు. కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోం. ఇది పార్టీలో తీసుకున్న నిర్ణయం. మనకు నష్టంచేసిన వారిని వదిలిపెట్టేది లేదు. లెక్కలు రాస్తున్నాం. వడ్డీతో సహా తీర్చుకుంటాం. ఓపిక పట్టండి. భవిష్యత్తు మనదే. మళ్లీ మనం అధికారంలోకి రావడం ఖాయం’ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఉద్దెర పథకాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నిర్ణయాలతో పలు సంస్థలు దివాలా తీస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ, సివిల్ సైప్లె తదితర సంస్థలు కూడా త్వరలోనే దివాలా తీయడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ఆసరా పెన్షన్ రూ. 4 వేలు ఏమైంది? రైతుబంధు రూ. 15 వేలు ఏది? వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఎక్కడ? వడ్లకు బోనస్ ఏది?’ అని ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉండెనో.. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు.