తెలంగాణలో కూడా కరెంటు లేకుండే. అనేక మంది రైతులు బాయిలకాడికి రాత్రి పూట పోయి పాము, తేలు కాట్లతో చచ్చిపోయారు. ఇప్పుడు ఎలా వస్తున్నది 24గంటల కరెంటు? కేసీఆర్ ఏం జేసిండు? కేసీఆర్ స్విచ్లో వేలు పెట్టిండా? ఒక్కటే..! ఒళ్లు వంచాలె. మెదడు కరగదీయాలె. తపన పడాలె. తపనపడే టీమును తయారు చేసుకోవాలె. అప్పుడు కచ్చితంగా సాధ్యమైతది. సాధ్యం కాని ప్రశ్నే లేదు. నెపాలు చెప్పేటోళ్లు నాయకులు కారు.
– సీఎం కేసీఆర్
ఒక సూటి ప్రశ్న
సువిశాల భారతదేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలి కదా? మన దేశానికి ఉన్న లక్ష్యం ఏమిటి? ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమేనా? అదేనా మన లక్ష్యం? దేశంలో అదే కదా జరుగుతున్నది. అడ్డగోలుగా అబద్ధాలు, కట్టలకు కట్టలు డబ్బులు కుమ్మరించడం, మత కల్లోలాలను రెచ్చగొట్టడం, కులాల కుమ్ములాటలు, కుంపట్లు.. ఇదా మన దేశ లక్ష్యం? ఇదా రాజకీయాల లక్షణం.!!
-సీఎం కేసీఆర్
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, పటాకులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం తెచ్చింది? మేకిన్ ఇండియాతో ఏం వచ్చింది? మేకిన్ ఇండియా నిజమైతే పేటపేటకు, పూటపూటకు చైనా బజార్ ఉంటదా? ఇండియాలో వేర్ ఈజ్ భారత్ బజార్?
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప్రజలు ఎందుకు శిక్షించబడాలని, ఎందుకు వంచించబడాలని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి తదితరులు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ శాఖను ప్రారంభించి కేసీఆర్ ప్రసంగించారు.
భారత ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు సిద్ధించలేదని ముఖ్యమంత్రి అన్నారు. అపార భౌగోళిక, వాతావరణ, మానవ వనరులున్న దేశం చేరుకోవాల్సిన స్థాయిని అందుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 41 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నా ఇప్పటికీ పామాయిల్, కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ దుస్థితి ఇంకా కొనసాగాలో, నివారించాలో దేశ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉన్నదని అందుకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ వెంట నడాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే…
బీఆర్ఎస్ ప్రారంభించింది.. తమాషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఉన్న ఓ మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది. లక్ష్యశుద్ధి, సంకల్పశుద్ధి, కార్యశుద్ధి ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ప్రపంచమంతటా అనేకసార్లు ఇదే రుజువైంది. ఉదాహరణకు విద్యుత్తునే తీసుకుందాం. మన దేశంలోని స్థాపిత విద్యుత్తు శక్తి 4 లక్షల మెగావాట్లు. సోలార్ విద్యుత్తు, పవన విద్యుత్తు, హైడల్ పవర్, థర్మల్ పవర్ అన్నీకలిపి సుమారు 4 లక్షల 10 వేల 100 మెగావాట్లు. కానీ దేశం ఏనాడూ 2 లక్షల 10 వేల మెగావాట్లకు మించి కరెంటును వినియోగించుకోలేదు. నీళ్లు పుష్కలంగా ఉంటాయి.. కానీ పొలాల్లో పారవు. విద్యుత్తు కావాల్సినంత ఉంటుంది.. కానీ ఇండ్లల్లో కరెంట్ ఉండదు. ఇలా చెప్పుకుంటే పోతే.. అన్నింట్లోనూ ఇదే దుస్థితి. ఇంతగొప్ప దేశంలో పుష్కలమైన వనరులు, సంపద ఉండీ ప్రజలెందుకు శిక్షించబడాలి? ఎందుకు వంచించబడాలి? ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగాలా? ప్రజల బతుకుల్లో మంచి జరుగొద్దా? బీఆర్ఎస్ ప్రశ్న ఇదే. ఆ మార్పు కోసమే బీఆర్ఎస్. ఈ దేశంలో ప్రబలమైన, గుణాత్మకమైన మార్పు కచ్చితంగా తీసుకొచ్చి ప్రజల బతుకులను మార్చి, దేశంలోని ఆలోచనా పరులను ఒక దగ్గరికి చేర్చి, ఒక మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్. ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక వ్యక్తి కోసమో పార్టీ కాదు.
ఏ ఊరి కోసమో, ఏ పల్లె కోసమో ఈ పార్టీ పెట్టలేదు. యావత్ భారత్ కోసం. ఇదొక యజ్ఞం. ఈ ప్రయాణంలో కొన్ని నష్టాలు కలుగొచ్చు, కొన్ని కష్టాలు రావొచ్చు. నెగెటివ్ శక్తులు మనల్ని తప్పు పట్టొచ్చు. ఏ గొప్ప పనిని ప్రారంభించినా మొట్టమొదట ఎదురయ్యేది అవహేళనలే! మహాత్మాగాంధీ వంటి మంచి మనిషి జీవితంలోనూ ఇదే జరిగింది. ఏదైనా ప్రారంభమైతే మొదట గుర్తించరు. నిరాకరిస్తరు. ఏమున్నదయా ఈ బీఆర్ఎస్లో అని అనుకోవచ్చు. కొన్నిరోజుల తర్వాత మనం మాటల వేడిని కాస్త పెంచితే.. అప్పుడు హేళన చేయడం మొదలు పెడతారు. ఇక పార్థసారథి, చంద్రశేఖర్, కిశోర్బాబుతో ఏమైతది? కేసీఆర్ ఏందయా పిడికెడంత ఉంటడు. బక్కోడు. వీళ్లతోటి ఏమైనా అయితదా? అని అవహేళన చేయడం ప్రారంభిస్తరు. ఆ తర్వాత మనపై మాటల దాడి చేస్తరు. చివరికి మనకు విజయం చేకూరుతుంది. వందకు వందశాతం విజయం సాధిస్తాం. అప్పుడు, వాళ్లకే హితబోధ అవుతుంది.
బీఆర్ఎస్ ట్రైనింగ్ క్లాసులు…
బీఆర్ఎస్ ఒక లక్ష్యంతో ఏర్పడిన పార్టీ. అందుకే ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తాం. బీఆర్ఎస్ ఏ లక్ష్యంతో పుట్టింది మొదలైన విషయాలన్నీ అర్థమయ్యేలా లెక్చరర్లు వివరిస్తారు. మొన్న ఢిల్లీలో కొందరు జర్నలిస్టు మిత్రులు అడిగారు. కేసీఆర్ గారూ.. ఎందుకు ఇంత పెద్ద బాధ్యత తలకెత్తుకున్నారు? అని. నేను వాళ్లను ఒక్కటే అడిగాను. మీరింత సీనియర్ జర్నలిస్టులు కదా? ఈ రోజు మనదేశం లక్ష్యం ఏమిటి అని? అసలు మనలో ఎవరికన్నా తెలుసా? ఆ వైపుగా మనం ఆలోచిస్తున్నామా? ఇంతపెద్ద సువిశాల భారతదేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలి కదా? ఒక లక్ష్యంతో ప్రజలందరినీ కదిలిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
ఈ దేశానికి ఎంత మంచి జరుగుతుంది? అసలు.. ప్రపంచంలో ఏ జాతి అయినా, ఏ దేశమైనా చేసేది ఇదే కదా? ప్రగతి కోసం మేధావులంతా కూర్చొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రజల ముందు పెట్టి.. ముందుకు వెళ్తారు. కానీ.. మన దేశంలో ఏం జరుగుతున్నది? చివరికి ఈ దేశం లక్ష్యం ఏమైంది? ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలవడమేనా లక్ష్యం? అడ్డగోలుగా అబద్ధాలు, కట్టలకు కట్టలు డబ్బులు కుమ్మరించడం, మత కల్లోలాలను రెచ్చగొట్టడం, కులాల కుమ్ములాటలు, కుంపట్లు.. ఇదా మన దేశ లక్ష్యం? పరిస్థితులకు తగ్గట్టు ఇందులో ఏదో ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి ఎన్నికల్లో గెలవడమేనా లక్ష్యం? ఇదేనా మనకు కావాల్సింది? ఇదేనా దేశం కోరుకుంటున్నది? ఇటువంటి పరిస్థితులను మార్చాలి. దేశానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి. అందుకే బీఆర్ఎస్.
దేశంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా?
దేశంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? రైతులందరూ నెలల తరబడి ఢిల్లీలో ధర్నాలు చేశారు. అకారణంగా ఎంతోమంది చనిపోయారు. కానీ.. కేంద్రం వాళ్ల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం సానుభూతి కూడా తెలుపలేదు. దేశానికి అన్నం పెట్టే రైతు రోడ్డెక్కితే సమాజమంతా ఏం చేస్తున్నట్టు? ఒక్క రైతుల పరిస్థితే కాదు, దేశంలో అన్నింటా ఇదే దుస్థితి నెలకొన్నది. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు.. కొందరు అగ్రవర్ణాల్లోని పేదలు అందరూ ఎందుకు ఏడుస్తుండాలి? వాళ్లకు ఎందుకీ వేదన? ఎందుకీ రకమైన అసంతృప్తి? దీనికి బాధ్యులెవరు? అని దేశం ఆలోచించాలి.
వేరే రాష్ర్టాలకు వెళ్తే.. మమ్మల్ని ఎస్సీల్లో కలపాలని రజకులు, కొందరు బీసీ-ఏ క్యాటగిరీలో కలపాలని ఇంకొకరు.. ఇలా ఎందరో వస్తున్నరు? ఎందుకో తెలుసా? ఎస్సీ, ఎస్టీల్లో కలిపితే ఏమైనా లబ్ధి చేకూరుతుందేమోననే చిన్న ఆశ. కానీ, వాళ్ల ఆక్రందనను తీర్చే వాళ్లెవరు?. ఉన్నదానికంటే ఇంకాస్త మంచిగా బతకొచ్చనే వాళ్ల ఆశను ఎలా తప్పని అంటాం? అసలీ దేశంలో ఏం జరుగుతుందో, ప్రజలకు ఏం కావాలో అలోచించే పరిస్థితే లేదు. బహుముఖ మేధావులు ఎంతోమంది దేశాన్ని బాగుచేయాలనే సంకల్పంతో ఉన్నారు. కానీ వాళ్ల అభిప్రాయాలను పట్టించుకొన్నవాళ్లు లేరు. వాళ్ల మేధస్సును స్వీకరించే గొప్ప మనసు లేదు. జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడే స్వీకరించాలి. తెలియని దాన్ని తెలుసుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలి. అప్పుడే ఈ దేశానికి, ప్రజలకు మంచి చేయగలుగుతాం. సమాజంలో మార్పు తీసుకురాగలం. ఆ మార్పు కోసమే బీఆర్ఎస్’ అని కేసీఆర్ వివరించారు.
వనరులున్నాయి, వసతులున్నాయి, కష్టించి పనిచేయగల మనుషులున్నారు? అయినా దేశం ఎందుకు వంచనకు గురవుతున్నది?
…ఈ ప్రశ్న వేసేందుకు పుట్టిందే బీఆర్ఎస్!
నీళ్లున్నాయి. కానీ, పొలాలకు రావు. కరెంటుంది. కానీ రైతులకు అందదు. చెన్నై నగరంలో బకెట్ నీళ్లు కరువా? దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కోతలా?
…ఇది అడిగేందుకే బీఆర్ఎస్!
దేశం అనుసరించిన బ్యాడ్ పవర్ పాలసీ ఫలితం కరెంటు కోతలు. బ్యాడ్ వాటర్ పాలసీ ఫలితం నీటి యుద్ధాలు. ఈ పరిస్థితి మారాలా? వద్దా?
…తేల్చేందుకు వచ్చిందే బీఆర్ఎస్!
ఇప్పుడు చైనా లేనిది ప్రపంచమే లేదు. పూటకు, పేటకో చైనా బజార్. మరి భారత్ బజార్ ఏది? ఏమైంది మేకిన్ ఇండియా?
…నిలదీసేందుకు వచ్చిందే బీఆర్ఎస్!
లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని వేల కోట్లకు అమ్ముతుంటే, దీనిపై ఒక్క మేధావీ మాట్లాడలేక మౌనం వహించారు.
…ఈ దుర్మార్గాన్ని ఆపడం కోసం వచ్చిందే బీఆర్ఎస్!
ఇది బుద్ధూగాళ్ల దేశం కాదు; బుద్ధిమంతుల దేశం. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే, తప్పకుండా ఇండియా రియాక్ట్స్.
…ఆ నమ్మకంతో ఆవిర్భవించినదే బీఆర్ఎస్!
ఇండియా లాస్ట్ ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్. నెపాలు చెప్పేవాడు నాయకుడు కాదు. మేధావుల ప్రేరణను వ్యవస్థ కోసం వ్యవస్థీకృతం చేసి, ఫలితాలు సాధిస్తాం.
…అందుకోసం అవతరించిందే బీఆర్ఎస్!
కులం కోసమో, మతం కోసమో, వర్గం కోసమో కాదు; దేశ సమస్యల పరిష్కారం కోసం, సువిశాల భారతంలో గుణాత్మక మార్పు కోసమే మా ప్రయత్నం.
…ప్రజల మేలు కోసం వచ్చిందే బీఆర్ఎస్!