కాంగ్రెస్ మంత్రులు బీరాలు పలికి, జబ్బలు చరుచుకొని.. కత్తులు తిప్పి.. ఆనక తోక ముడిచారు. చొక్కా మడిచి సవాళ్లు విసిరి చివరికి పలాయనం చిత్తగించారు. తలబిరుసు మాటలు మాట్లాడి ఆఖరికి తల దించుకున్నారు. దొంగతనం దొరికిపోయి నోట మాటలు రాక నిచ్చేష్టులయ్యారు. వాదించేందుకు సబ్జెక్టు లేక.. సరుకు లేక విలవిల్లాడారు. నోటికొచ్చిన అంకెలతో రంకెలు వేసిన సచివులు, రుజువుల దగ్గరికొచ్చేసరికి వెనక్కి తిరిగి చూడకుండా పరారయ్యారు. తామే కోరిన చోట చర్చల కోసం వేసిన సీటు ఖాళీగా వెక్కిరిస్తుంటే వెర్రి లాజిక్కులతో వెకిలి వాదనలతో తమకే మింగుడుపడని వింత వాదనలకు దిగారు. వివాదానికి కారకుడైన అసలు కథానాయకుడు పంపించిన స్క్రిప్టును వెరిఫికేషన్ లేకుండా అక్షరాలా వల్లించిన పాపానికి సీనియర్ మంత్రి నలుగురిలో బకరా అయ్యాడు. మద్దతు కోసం ముందుకు వచ్చిన సచివులూ వెర్రిముఖాలు వేశారు. ముఖ్యనేత మురికి వ్యాఖ్యలను సమర్థించే క్రమంలో వెర్రిచూపులు చూశారు. గట్టిగా దబాయిస్తే అంకెలు, వాస్తవాలు పారిపోవు. మైకు దొరికింది కదా? అని నోటికొచ్చిన కథలు చెప్తే నవ్వుల పాలే అవుతారు.
ప్రభుత్వంలో ఆస్తులైనా అప్పులైనా అన్నింటికీ లెక్కలుంటయ్. దస్ర్తాలుంటయ్. వాటిని మార్చడం ఎవరితరం కాదు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులెన్నో పార్లమెంట్లోనే కేంద్రం వెల్లడించింది. మైకుంది కదా..? నోరుంది కదా..? అని నోటికొచ్చిన అంకెలతో రంకెలు వేస్తే చెల్లదు. ఎన్ని మాటలు.. ఎంత రొచ్చు! 8 లక్షల కోట్ల అప్పట!! ఫోన్లు వింటున్నారట!! ఇంటికో ఉద్యోగమిస్తామన్నారట!! ఎవరన్నారు? ఎక్కడ ఏ సందర్భంలో అన్నారు? ఏ మ్యానిఫెస్టోలో గ్యారెంటీ ఇచ్చారో చెప్పగలరా? ప్రజలేమన్నా పిచ్చివాళ్లా? ఏది చెప్తే అది నమ్మడానికి? ఎవరి మాట శిలాశాసనమో.. వారికి తెలుసు.
వీళ్లు వ్యవసాయాన్ని పండుగ చేశారట! లక్షల ఉద్యోగాలిచ్చారట! రుణమాఫీ నూరు శాతం చేశారట! నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ఆఖరికి నిండు గర్భిణులను కూడా అరిగోస పెడుతున్న సర్కార్.. మైకుల్లో సొల్లుకథలు చెప్పుకొంటున్నది. ఒక దశా దిశ లేని సర్కార్, పాలనమీద తనదంటూ ఏ ముద్ర వేయలేని సర్కార్ ఆయుస్సులో అరభాగం అప్పుడే పూర్తయింది. చేతగానితనంతో పక్క రాష్ర్టాలముందు తెలంగాణ పరువు తీస్తున్నది. సంస్కారం, హూందాతనం లేకుండా సభామర్యాదలు చూడకుండా నోటి కంపును మైకుల ద్వారా ప్రవహింపచేస్తూ పోతే ఎక్కడోచోట ఏదో సందర్భంలో బకరాలు కాక తప్పదనేది గురువారం నాడు రాజధానిలో రోజంతా జరిగిన ఘటనల పరిణామాల క్రమం చెప్పే సందేశం.
పోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? : పొన్నం

మాకు హరీశ్రావు ఫోన్ చేశారు. మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్పార్క్ నుంచి వెళ్లిపోయినం. అధికారిక కార్యక్రమంలో ఉన్నం కాబట్టే ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం?
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్’ అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు. తీరా అసలు సమయం వచ్చేసరికి మంత్రులు పోలీసుల వెనుక దాక్కున్నారు. అమరుల స్థూపం వెనుక రక్షణ వలయం ఏర్పాటు చేసుకొని దమ్ముంటే ఇక్కడికే రమ్మని మరో సవాల్ విసిరారు.
‘సరే అక్కడికే వస్తున్నాం.. ఉండండి’ అంటూ బీఆర్ఎస్ నేతలు నడక అందుకోగానే కాంగ్రెస్ మంత్రులు తోకలు ముడిచారు. బీఆర్ఎస్ నేతలు రాకుండా అరెస్టులు చేయండని ఆర్డర్లు వేసి అమరుల సాక్షిగా పలాయనం చిత్తగించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య రాష్ట్ర అప్పులు, గురుకుల టెండర్ల అవకతవకలపై మొదలైన ‘బహిరంగ చర్చ’ ఉద్రిక్తంగా మారింది. తెలంగాణభవన్ నుంచి గన్పార్క్ వరకు సాగిన సవాళ్లు-ప్రతిసవాళ్లు, పోలీస్ జోక్యం, అడ్డగింతలు, అరెస్టులతో రాష్ట్ర రాజకీయం ఒకసారిగా వేడెకింది.
కాంగ్రెస్ మంత్రుల డిమాండ్ మేరకు పాదయాత్రతో గన్పార్క్కు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, గురుకులాల టెండర్ల అవినీతి మీద చర్చ కోసం బయలుదేరిన బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్లీడర్ హరీశ్రావును నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణభవన్ గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.
ఊహించని పరిణామానికి ఆందోళన చెందిన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. పోలీసు దుశ్చర్యను అడ్డుకుంటూ నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతంగా నెట్టివేశారు. పోలీసుల బలప్రయోగంతో మాజీ మంత్రి హరీశ్రావు కింద పడిపోవడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు చర్చలకు పిలిచిన నలుగురు మంత్రులు చర్చలు జరుపకుండానే పరారయ్యారు.
సవాల్కు సై

తెలంగాణభవన్లో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, సంజయ్, కర్నె, జీవన్రెడ్డి, పట్నం, రాగిడి, వెంకటేశ్వర్రెడ్డి, కార్తీక్రెడ్డి, జైపాల్యాదవ్, తదితరులు
రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడుతూ.. తెలంగాణ పరువు తీస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు. ఎవరు ఎంత అప్పు చేశారో.. తెచ్చిన అప్పుతో ఏం చేశారో.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన.. బీఆర్ఎస్ పదేండ్ల పాలన మీద సీఎం రేవంత్రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అదొక్కటే కాదని, వ్యవసాయ సంక్షోభం, రైతన్నల దుస్థితి, అన్ని రంగాల్లో కాంగ్రెస్ సరార్ వైఫల్యాలపై ఎకడైనా, ఎప్పుడైనా చర్చిద్దామని సవాల్ చేశారు. సమయం, స్థలం ముఖ్యమంత్రి చెబితే తానే అకడికి వస్తానని స్పష్టంచేశారు.
తన సవాల్ను సీఎం స్వీకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే అకడికకడే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకొంటానని కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానంటూ మధ్యలోకి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని, రూ.6,000 కోట్లు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతున్నట్టు నిరూపిస్తానని ప్రకటించారు.
తెలంగాణభవన్కే వచ్చి నిరూపిస్తానని, తాను చెప్పిన రాష్ట్ర అప్పుల లెకలు తప్పని నిరూపిస్తే, మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు. ఇదిలాఉంటే మరోవైపు సంక్షేమ శాఖల టెండర్లలో రూ.2,000 కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేసిన సవాల్పై తాము చర్చకు స్వీకరిస్తున్నామని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా స్పందించారు. హరీశ్రావు, కేటీఆర్ చర్చలకు వస్తే తాము (పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్) అజారుద్దీన్తో కలిసి చర్చలకు వస్తామని ప్రకటించారు. ప్రవీణ్కుమార్ ఒక్కరే వస్తే కాంగ్రెస్ అధికార ప్రతినిధిని చర్చలకు పంపిస్తామని ప్రకటించారు.
మంత్రి వద్దకే మేమొస్తం!

చర్చలకు సిద్ధమని బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్.. చర్చ లేకుండానే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయించింది. గురువారం తెలంగాణ భవన్కు వస్తానని చెప్పిన జూపల్లి కోసం ఎదురు చూసి చివరికి గన్పార్క్ వద్దకు బయలుదేరిన హరీశ్ను తెలంగాణభవన్ వద్ద అరెస్ట్ చేస్తున్న పోలీసులు

బీఆర్ఎస్ ఆఫీస్కే వస్తానని బుధవారం, గన్పార్క్కు వస్తానని గురువారం మంత్రి జూపల్లి ప్రకటించారు. గన్పార్క్కు వస్తామని బుధవారం, అసెంబ్లీలో చర్చకు సిద్ధమని గురువారం మంత్రి అడ్లూరి చెప్పారు. తీరా మంత్రులు గురువారం గన్పార్క్ వద్దకు వచ్చి మాట్లాడారు. గన్పార్క్కు వస్తున్నామని చెప్పేందుకు హరీశ్ ఫోన్ చేసినా మంత్రులెవరూ స్పందించలేదు.
సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణభవన్కు కానీ, గన్పార్క్కు కానీ రాలేదు. గాంధీభవన్కు వెళ్లిపోయారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో కొద్దిసేపు సమయం వెళ్ల్లదీశారు. ఎవరు ఏ సలహా ఇచ్చారో కానీ, మీడియా వేదికగా యూటర్న్ తీసుకొన్నారు. తాను తెలంగాణభవన్కు వెళ్లడం కాదని, కేటీఆర్, హరీశ్రావు ఇద్దరూ కలిసి గన్పార్క్కు వస్తే ఒకేసారి సమాధానం చెప్తానని మాట మార్చారు. అదే సమయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, అజారుద్దీన్ గన్పార్క్ వద్దకు చేరుకొన్నారు.
గురుకులాల్లో జరిగిన అవినీతి, గత ప్రభుత్వ అప్పులు, ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు తాము సిద్ధమని, హరీశ్రావు, కేటీఆర్ గన్పార్క్ వద్దకే రావాలని ముగ్గురు మంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. గురుకులాల్లో ఏ మేరకు నిధులు ఖర్చు చేశామో ఆ హిస్టరీ మొత్తం తమ వద్ద ఉన్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఈ సవాళ్లను మొదలు పెట్టిన హరీశ్రావు వెంటనే చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
గురుకులాల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే.. ఏం చేయడానికైనా సిద్ధమని తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా.. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై చర్చించేందుకు ఉన్నామని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గన్పార్క్ వద్దకు నాలుగో మంత్రిగా జూపల్లి కృష్ణారావు వచ్చి చేరారు. తన రాజకీయ జీవితంలో ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని, కేటీఆర్, హరీశ్రావు తనకు పిల్లలతో సమానమని, వాళ్లతో తనకేం చర్చ? తనతో చర్చకు కేసీఆరే రావాలని నాలిక మడతేశారు.
తాను చెప్పిన రాష్ట్ర అప్పుల లెకలు తప్పని నిరూపిస్తే, మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. తాము చెప్పే లెకలు తప్పని కేసీఆర్ నోటితో చెప్పించాలని మెలికపెట్టారు. విచిత్రం ఏమిటంటే, అప్పటికే గన్పార్క్, అమరవీరుల స్తూపం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. మంత్రులు ఉన్న చోటికి ఈగలు కూడా పోకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ఎల్పీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, పార్టీ నాయకులు
గన్పార్క్ వద్దకు మంత్రి జూపల్లి వచ్చారనే సమాచారంతో కేటీఆర్ తెలంగాణభవన్ నుంచి గన్పార్క్వరకు నడుచుకుంటూ పాదయాత్రగా బయలుదేరారు. అదే సమయంలో గన్పార్క్ నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన హరీశ్రావు.. అవినీతి అప్పులపై చర్చించేందుకు ప్రెస్క్లబ్కు రమ్మని తాను సవాల్ చేస్తే.. అమరవీరుల స్తూపం వద్దకు రమ్మన్నారని, తమకు ఎలాంటి భేషజాలు లేవని, తామే గన్పార్క్ వద్దకు బయల్దేరుతున్నామని ప్రకటించారు.
సాయంత్రం వరకూ చర్చిద్దామని, ఈలోగా మంత్రులు అక్కడి నుంచి పరారవ్వొద్దని, మధ్యలో తమను అరెస్ట్ చేయించే కుట్రలు చేయొద్దని హెచ్చరికలు చేసుకుంటూ బయలుదేరారు. వారి వెంట ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, శ్రీనివాస్గౌడ్తోపాటు బీఆర్ఎస్ శ్రేణులు అనుసరించాయి. అయితే, తెలంగాణభవన్ గేటు దాటకముందే పోలీసులు వారిని చుట్టుముట్టి అడ్డుకొన్నారు.
చర్చకు ఎప్పుడొస్తరు?

కంచన్బాగ్ పోలీస్స్టేషన్ వద్ద మంత్రి జూపల్లి కోసం ఎదురుచూస్తున్న మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, తదితరులు
వందలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తోపులాటలో హరీశ్రావు కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనకు గాయాలు కాకుండా పట్టుకొని పైకి లేపారు. ఆ తర్వాత హరీశ్రావుతోపాటు శ్రీనివాస్గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎకించి పోలీస్స్టేషన్లకు తరలించారు.
మంత్రివర్యా ఎప్పుడొస్తరు?

అప్పులపై చర్చకు తెలంగాణ భవన్కు వస్తానని సవాల్ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం గురువారం తెలంగాణ భవన్లో కుర్చీ వేసి, శాలువాతో ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు
మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తారేమోననే ఆలోచనతో కేటీఆర్ గురువారం ఉదయమే తెలంగాణభవన్కు చేరుకున్నారు. అక్కడ జూపల్లి కోసం ప్రత్యేకంగా ఒక సీటు ఏర్పాటుచేశారు. దానిపై ఆయన పేరు కూడా రాసి పెట్టారు. తమ పార్టీ కార్యాలయానికి వస్తున్న చర్చల ప్రతినిధిని గౌరవించడం కోసం శాలువా కూడా తెప్పించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, తెచ్చిన అప్పులు తదితర వివరాలకు సంబంధించిన పత్రాలు, ఫైళ్లతో వచ్చి జూపల్లి రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. అదే సమయంలో గురుకులాల టెండర్లలో జరిగిన అవినీతి మీద ముగ్గురు మంత్రులు చర్చకు పిలిచిన నేపథ్యంలో వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలని హరీశ్రావు నిర్ణయించుకున్నారు.
వారికి అందుబాటులో ఉండటం కోసం హరీశ్రావు గురుకుల టెండర్ల అక్రమాలకు సంబంధించిన అన్నీ డాక్యుమెంటరీ ఆధారాలతో తెలంగాణభవన్కు వచ్చారు. అదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తదితరులు కూడా అక్కడికే వచ్చి మంత్రుల కోసం వేచి ఉన్నారు.
మీ అవినీతికి సాక్ష్యాలివిగో..

తెలంగాణభవన్ నుంచి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా టెండర్ల అవినీతికి సాక్ష్యాలివేనంటూ చూపుతున్న హరీశ్రావు
హరీశ్రావు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి ఎకించగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వందలాది వాహనాల కాన్వాయ్తో పోలీసు వాహనాలను వెంబడించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. హరీశ్రావును ఎకడికి తీసుకెళ్తే.. అక్కడి వరకు వెంటవస్తామంటూ గులాబీ శ్రేణులు పట్టుబట్టాయి.
అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు హరీశ్రావు ఉన్న వాహనాన్ని ఏ పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారనే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. దాదాపు గంటన్నరపాటు సిటీలోనే తిప్పుతూ పదే పదే రూట్లు మారుస్తూ ఉతంఠ రేపారు. పోలీసులు రూట్ మార్పుల వ్యూహాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు పసిగడుతూ అనుసరించారు. చివరకు హరీశ్రావును కంచన్బాగ్ పోలీసుస్టేషన్కు తరలించారు.

సీఎం కాన్వాయ్ కాదు..
పోలీసుల దౌర్జన్యం

పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కిందపడ్డ హరీశ్రావు
ఈ సందర్భంగానే హరీశ్రావు తనను చర్చలకు పిలిచిన ముగ్గురు మంత్రులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించారు. చర్చలకు రమ్మని పిలిచి పోలీసులతో అరెస్టు చేయించడం పద్ధతి కాదని, శాంతియుత వాతావరణంలో టెండర్లలో జరిగిన అవినీతి మీద సాయంత్రం వరకు చర్చిద్దామని చెప్పడానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్కు ఫోన్లు చేశారు. కానీ మంత్రులెవ్వరూ ఆయన ఫోన్లు ఎత్తలేదు. హరీశ్రావు ఫోన్లు చేస్తున్న సమయంలో ముగ్గురు మంత్రులు సీఎల్పీలో ఉన్నట్టు తెలిసింది.
ఆయన ఫోన్కాల్ను చూస్తూ..‘ఎత్తొద్దు’అని చెప్పుకోవడం ఆక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు గమనించారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన హరీశ్రావు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తాము ఇకడికి వచ్చింది కొట్లాడటానికి కాదని, చర్చించడానికని స్పష్టంచేశారు. గురుకుల టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని డాక్యుమెంటరీ ఆధారాలను చేతిలో పట్టుకొని వస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులే సవాల్ విసిరి, ఇప్పుడు తమను అడ్డుకోవడానికి పోలీసులను ప్రయోగించడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు.

మంత్రులకు కాల్ చేస్తున్నట్టు చూపుతున్న హరీశ్రావు, అదే సమయంలో తమ ఫోన్లను చూసుకుంటున్న పొన్నం, అడ్లూరి
బీఆర్ఎస్ సర్కార్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేసింది. అప్పులకు నెలకు సుమారుగా రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. అప్పులు ఉన్నది ని రూపిస్తా. ఈ లెక్కలు అబద్ధాలని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అప్పులపై చర్చించేందుకు ఎక్కడికో ఎందుకు బీఆర్ఎస్ ఆఫీసుకే వ స్తా. ఉదయమే అక్కడికి వస్తా. నేను చెప్పిన లెక్క లు తప్పని నిరూపిస్తే స్పీకర్కు రాజీనామా లేఖ ఇస్తా. నా సవాల్పై చర్చకు కేటీఆర్ సిద్ధమా?
కరెక్షన్ టు సబ్జెక్ట్. నిన్న అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం అని చెప్పాను. కానీ, అది రూ.7 లక్షల కోట్లు. ఇందులో తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్న అప్పు రూ.70 వేల కోట్లు తీసేస్తే, రూ.6.3 లక్షల కోట్లు అప్పు చేసింది. నా మాట అబద్ధమైతే కేసీఆర్ మాట్లాడాలి. నేను చెప్పిన లెకలు తప్పని.. కేసీఆర్తో కేటీఆర్ చెప్పించాలి. నా లెకలు తప్పని తేలితే రాజీనామాకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నా. నేను ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశాను. కేటీఆర్, హరీశ్రావు నా ముందు చిన్నపిల్లలు. నేను గన్పార్క్ కు వస్తాను. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు వచ్చి నాతో మాట్లాడాలి
(బుధవారం మాట): బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కేటీఆర్, హరీశ్రావుతో చర్చించేందుకు సిద్ధం. ఎవరొచ్చినా సరే.. నేను లెక్కలతో బీఆర్ఎస్ ఆఫీస్కే వస్తాను.. చర్చిస్తా.
కేసీఆర్తో చర్చకు సిద్ధం.. (గురువారం మాట): కేటీఆర్, హరీశ్రావు కాదు కేసీఆర్తో చర్చకు సిద్ధం. నేను చెప్పిన లెక్కలు తప్పని కేసీఆర్తో చెప్పించండి.. అప్పుడే రాజీనామా చేస్తా.
బీఆర్ఎస్ అప్పులపై సవాళ్లు విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. తెల్లారే పీఛేముడ్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రూ.8 లక్షల కోట్లపై చర్చించేందుకు, లెక్కలు నిరూపించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్కే వస్తానని సవాల్ విసిరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణభవన్లో ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేశారు. శాలువా కూడా తెప్పించి పెట్టారు. మంత్రితో అప్పులపై చర్చించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురు చూశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఇక్కడికి రాకుండా గాంధీభవన్కు వెళ్లారు. అక్కడ ఏదో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మంత్రి జూపల్లి సవాల్ విసిరి తోక ముడిచారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు ఎద్దేవా చేశారు. అయితే, కేటీఆర్, హరీశ్రావు విమర్శలతో గన్పార్క్ వద్ద చర్చకు సిద్ధమంటూ జూపల్లి మాట మార్చారు. పోనీ అక్కడకైనా వెళ్లి చర్చిద్దామని హరీశ్రావు బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి బయల్దేరగానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ చేసిన అప్పులంటూ సవాళ్లపై సవాళ్లు విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు అసలు అప్పు లెక్కనే సక్కగ చెప్పలేదు. పూటకో లెక్క చెప్తూ ఆయనే తికమకకు గురయ్యారు. ఒకసారి రూ.8 లక్షల కోట్లని, మరోసారి రూ.7 లక్షల కోట్లని, ఇంకోసారి రూ.6.7 లక్షల కోట్లంటూ ఇలా ఒక్కోసారి ఒక్కో లెక్క చెప్పారు. గంటల వ్యవధిలోనే అప్పులపై పొంతనలేని లెక్కలు చెప్పడం గమనార్హం.
గురుకులాల్లో అవినీతిపై చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసిరిన మంత్రులు అ డ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ చ ర్చించే వేదిక విషయంలో మాత్రం తికమకపడ్డా రు. ఒకసారి గన్పార్క్ అంటూ మరోసారి అసెంబ్లీలో అంటూ దాటవేశారు. బీఆర్ఎస్ నేతలు గన్పార్క్ కు వచ్చేందుకు సిద్ధం కాగానే… అసెంబ్లీలోనే చర్చకు సిద్ధమంటూ మాట మార్చారు.
అడ్లూరి లక్ష్మణ్: గురుకులాల్లో అవినీతి పై ప్రెస్క్లబ్లో చర్చిద్దామన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవాల్ను స్వీకరిస్తున్నాం. ప్ర వీణ్కుమార్ ఒక్కరే వస్తే చర్చించం.. కేటీఆర్, హరీశ్రావును తీసుకొని గన్పార్క్ వద్దకు రండి. అవినీతిపై చర్చిద్దాం.
పొన్నం ప్రభాకర్: సంక్షేమ శాఖల అవినీతిపై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవాల్ను స్వీకరిస్తున్నా. అవినీతిపై చర్చించేందుకు సిద్ధం. ప్రెస్క్లబ్ వేదికగా చర్చిద్దాం.
అడ్లూరి, పొన్నం: సవాల్ చేసినట్టు మేం గన్పార్క్ వద్దకు వచ్చాం. అన్ని ఆ ధారాలు తీసుకొచ్చినం. అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నాం.
బుధవారం మంత్రులు: గురుకులాల్లో అవినీతిపై ప్రెస్క్లబ్లో చర్చిద్దామన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవాల్ను స్వీకరిస్తున్నాం. ప్రవీణ్కుమార్ ఒక్కరే వస్తే చర్చించం.. కేటీఆర్, హరీశ్రావును తీసుకొని రావాలి.
కేటీఆర్, హరీశ్రావు, ప్రవీణ్కుమార్తో కాదు, కేసీఆర్ వస్తే చర్చిస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. అక్కడ మేం చర్చకు సిద్ధం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
గురుకుల టెండర్లలో కొనుగోళ్లు, టెండర్లపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ పొంతనలేని విరుద్ధ మాటలు మాట్లాడటం గమనార్హం. అడ్లూరి లక్ష్మణ్ గురుకుల టెండర్ మొత్తం రూ.690 కోట్లు అని చెప్పగా, మంత్రి పొ న్నం రూ.643 కోట్లకు తగ్గించి చెప్పారు. ఇక మొత్తం టెండర్ల విలువ రూ.1,100 కోట్లని మంత్రి అడ్లూరి పేర్కొనగా, మం త్రి పొన్నం ప్రభాకర్ ఈ విలువ రూ.2 వేల కోట్లని చెప్పారు.
అడ్లూరి: గురుకులాల్లో కొనుగోళ్లకు సంబంధించి టెండర్ మొత్తం రూ.690 కోట్లు మాత్రమే. ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చింది రూ.500 కోట్లు. మొత్తంగా మొత్తం కలిపితే రూ.1,100 కోట్లకు మించిలేదు. కానీ రెండువేల, మూడువేల కోట్ల అవినీతి అంటూ ఆరోపిస్తున్నారు. రూ.2 వేల కోట్ల స్కామ్ జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా.
పొన్నం: గురుకులాల్లో రూ.643 కోట్లు టెండర్ల్ ద్వారా పిలువగా, ప్రభుత్వరంగ సంస్థలు రూ.500 కోట్లకు పిలిచాయి. అంటే మొత్తంగా టెండర్ విలువ రూ.1,143 కోట్లు మాత్రమే. మిగిలిన కొనుగోళ్లు అన్నీ కలిపినా ఇది రూ.2వేల కోట్ల టెండర్ కాదు.
తాను ఫోన్ చేస్తే మంత్రులెవరూ ఎత్తడంలేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. అయితే, ఇది వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అంగీకరించారు. తమకు హరీశ్రావు ఫోన్ చేశారని, కానీ తామే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని స్పష్టంచేశారు. అప్పటికే తాము గన్పార్క్ నుంచి వెళ్లిపోయామని, అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నాం కాబట్టే ఫోన్ ఎత్తలేదని చెప్పారు.