దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న చరిత్రాత్మక సభకు ఖమ్మం వేదికైంది. నేడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారతదేశ రాజకీయ యవనికపై పాత శక్తుల ఏకీకరణకు, కొత్త శక్తి పుట్టుకకు నాంది పలుకబోతున్నది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన తొలినాళ్లలో కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన సభ ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలను మార్చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమే’ అనే నమ్మకాన్ని కలిగించింది. నేడు జరుగుతున్న బీఆర్ఎస్ మొదటి సభ కూడా అలాంటి చారిత్రక ఘట్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -ఇంటర్వ్యూలో మంత్రి తన్నీరు హరీశ్రావు
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ దేశ దిశ, దశను మార్చే సభ అని వైద్యారోగ్య శాఖ మంత్రి, ఖమ్మం బహిరంగ సభ ఇన్చార్జి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో దేశంలోని 4 జాతీయ పార్టీలు కదిలి ఖమ్మం రావడం తెలంగాణ జాతికే గర్వకారణమని చెప్పారు. దేశ స్థితిగతులను మార్చే సభ కాబ ట్టే, దేశంలోని అనేక మంది ఖమ్మం సభ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనిన్నారు. ఖమ్మం సభ నేపథ్యంలో బీజేపీ అసమర్థ విధానాలు, బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై హరీశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ..
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్తోపాటు అనేక పార్టీలున్నాయి. మరి దేశానికి బీఆర్ఎస్ మాత్రమే ఎందుకు అవసరం?
ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాంగ్రెస్ బలహీనత, నాయకత్వలోపం వల్లే బీజేపీ బలపడుతున్నది. బీజేపీ తప్పిదాలను ఎత్తిచూపడంలో, ప్రజల పక్షాన నిలబడడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. దేశ ప్రజలు బలమైన ప్రత్యామ్నా యం వైపు చూస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వారికి ఆశాదీపంలా కనిపిస్తున్నది.
ఎనిమిదేండ్లలో బీజేపీ పరిపాలన ఎలా ఉన్నది?
బీజేపీ అధికారంలోకి వచ్చిన 8ఏండ్లలో దేశానికి ఒరిగిందేంటి? ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. నల్లచట్టాలు తీసుకొచ్చి, 750 మంది రైతులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత సారీ చెప్పారు. చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించి ఏడాది దాటినా.. నేటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం ఇలా.. ప్రతిరంగాన్ని బీజేపీ ధ్వంసం చేసింది. ప్రపంచం ముందు దేశం పరిస్థితి రోజురోజుకూ బలహీన పడుతున్నది. కరెంట్ కోతలతో దేశం తల్లడిల్లుతున్నది. రైతులకు, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వలేరు. ఇవన్నీ పరిపాలనాలోపంతో జరిగేవే. ఈ పరిస్థితులన్నీ మారాలంటే సమర నాయకుడు కావాలి.
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకరుకాకపోతే మరొకరు? బీఆర్ఎస్కు స్కోప్ ఎలా?
ప్రత్యామ్నాయ ఎజెండా చూపగలిగితే ప్రజలు తప్పకుండా స్వాగతం పలుకుతారు. కేసీఆర్ ఎనిమిదేండ్లలో తెలంగాణ రూపురేఖలే మార్చేశారు. ఇక్కడ రైతు రాజులా బతుకుతున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ చాలా బలహీనంగా తయారైంది. గత 8 ఏండ్లలో జరిగిన ఎన్నికల్లో 95 శాతం సీట్లు కాంగ్రెస్ ఓడిపోయింది. అటువంటి కాంగ్రెస్ ఏ రకంగా ప్రజలకు ప్రత్యామ్నాయం చూపగలదు? తమకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించే నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
దేశంలో ఏ పార్టీ బీజేపీకి ఎదురు తిరగడం లేదు. బీఆర్ఎస్ ఎందుకంత సాహసం చేస్తున్నది?
తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్లలో అందరూ బక్కపలచనోడు కేసీఆర్తో ఏమైతది అన్నరు. అమావాస్యకు పుట్టింది, పున్నమికి పోతది అన్నారు. ఇదంతా ఉత్త ముచ్చటే అన్నారు. రానే రాదు, కానే కాదన్న తెలంగాణను సాధించి చూపిన వ్యక్తి కేసీఆర్. ఎవరూ అడగకపోయినా, మూడేండ్లలో ఇంటింటికీ నల్లానీళ్లు ఇస్తా, లేకపోతే ఓట్లు అడగను అని చెప్పి.. ఇచ్చి చూపించిన వ్యక్తి కేసీఆర్. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని చెబితే, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి లేచి ఇది నిజంగా జరిగితే తెలంగాణ అద్భుతంగా మారిపోతని చెప్పిండు. అంటే, అంత అనుభవం ఉన్న నాయకుడే సాధ్యమైతదా? అని సందేహించాడు. దాన్ని కేసీఆర్ చేసి చూపించారు. ఆ ధైర్యమే, ఆ విశ్వాసమే ఆయన్ను విజయం వైపు నడిపించింది. ఇప్పుడు కూడా అదే నమ్మకం, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు వెళుతున్నారు. విజయం సాధించడం తథ్యం.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన వెంటే ఈడీ, ఐటీ కేసులేంటి?
భవిష్యత్తులో ఇంకా ఈడీ, సీబీఐ కేసులు వస్తాయి. బీజేపీ సిద్ధాంతమే అది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగడం, విపక్ష సభ్యులను బలవంతంగా లొంగదీసుకోవడం, వాళ్లమీద అభాండాలు వేయ డం, మానసికంగా ఇబ్బందులకు గురిచేసి అపనమ్మకాన్ని సృష్టించి వాళ్లవైపు తిప్పుకోవడమే బీజేపీ విధానం. 2001లో టీఆర్ఎస్ పుట్టినప్పుడు సమైక్య పాలకులు అనేక కేసులు పెట్టా రు. భయపెట్టారు. జైల్లో వేశారు. కానీ, మేమేం భయపడలేదు. ఇవన్నీ మాకు కొత్తేం కాదు.
కేసీఆర్కు ఇవన్నీ ఎందుకు? మోదీతో కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా? అనేవాళ్లకు మీ సమాధానం?
మనకు ఆత్మగౌరవం ముఖ్యం. తెలంగాణ జాతి కాంప్రమైజ్ అయ్యేది కాది. నిజాం నవాబు మీవ జరిగిన పోరాటం గానీ, 69 ఉద్యమంలో గానీ, మొన్న జరిగిన మలిదశ ఉద్యమంగానీ, త్యాగాలకు, పోరాటాలకు పేరెన్నికగలది తెలంగాణ గడ్డ. లొంగిపోవడం, వంగిపోవడం ఈ జాతి రక్తంలోనే లేదు.
కేసీఆర్ను, హరీశ్రావును జైల్లో వేస్తాం అంటున్నారు. దీనిపై మీ స్పందన?
జైలుకు గాంధీగారు పోలేదా? ఇందిరాగాంధీ పోలేదా? ఎవరు పోలేదు జైలుకు? జైలుకు పోయినంత మాత్రాన
తెలంగాణపై మా తపనను ఆపగలరా?
అప్పుడు కరీంనగర్ సభ, ఇప్పుడు ఖమ్మం సభ.. రెండింటికీ మీరే ఏర్పాట్లు చేస్తున్నారు? మీ అనుభవమేంటి?
అది నాయకుడిపై ఉన్న నమ్మకం. నాయకత్వ లక్షణాలపై, చిన్నప్పటినుంచి మా నాయకుడు మాకు ఇచ్చిన శిక్షణ. మేము ప్రజల్లో ఎలా పనిచేయాలో నేర్పించారు. అందుకే దేశంలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే పార్టీలో బీఆర్ఎస్ ఒకటి. ఇంత పెద్ద సభలు నిర్వహించే పార్టీ దేశంలో మరొకటి ఉండదు.
దేశంలో ఏ రాజకీయ పార్టీలు చేయలేని సాహసం బీఆర్ఎస్ చేస్తుందా?
అదే సీఎం కేసీఆర్ ప్రత్యేకత. మా అభివృద్ధే సాహసంగా దేశంలో అడుగుపెడుతున్నాం. ప్రజలు ఆయన్ని దీవిస్తారు.
చివరిగా ఈ దేశాన్ని తెలంగాణ మోడల్ ఎలా డామినేట్ చేయబోతున్నది?
ఒకప్పుడు బెంగాలీలు చేస్తే దేశమంతా అనుసరించింది. ఇవాళ తెలంగాణ ఏం చేసినా దేశమంతా అదే అనుసరిస్తున్నది. గత ఐదారేండ్ల నుంచి చూస్తూనే ఉన్నాం.. రాబోయే రోజుల్లో మరిన్ని చూస్తాం.
బీఆర్ఎస్గా మారడంతో తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే వాళ్లకు మీ సమాధానమేంటి?
మా పుట్టుక తెలంగాణ. మా డీఎన్ఏ తెలంగాణ. అదెట్ల మారుతుంది? తన బిడ్డ ఎదిగితే ఏ తల్లిడండ్రులైనా ఆనందపడతారు. కేసీఆర్ ఎదుగుదలను చూసి తెలంగాణ జాతి గర్వపడుతున్నది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయబోతున్నది.
బీఆర్ఎస్కు ఉన్న సీట్లతో జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయగలదు?
దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లోనూ బీఆర్ఎస్ విస్తరిస్తుంది. ఇతర రాష్ర్టాల్లోనూ పోటీ చేస్తుంది. కలిసి వచ్చే పార్టీలతో నడుస్తాం. దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండాను చూపిస్తాం. ఓట్లు, సీట్ల కంటే కూడా కేసీఆర్ ప్రత్యామ్నాయ ఎజెండా చూపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. తెలంగాణలో ఎనిమిదేండ్లలో చేసి చూపించారు. ప్రజలకు సుపరిపాలన అందించి.. ఆ విధానాలతో దేశం ముందుకు వెళుతున్నారు. కాబట్టి.. తప్పనిసరిగా ప్రజలు బీఆర్ఎస్ను విశ్వసిస్తారు.