హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసి రైతాంగానికి భరోసా ఇవ్వటమే బీఆర్ఎస్ విధానమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలన్నదే తమ పార్టీ అధినేత కేసీఆర్ ఎజెండా అని తెలిపారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నదని, మోదీ సర్కార్ రైతులను అన్ని విధాలా దగా చేస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆరోపించారు. ఢిల్లీలో శుక్రవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మాడల్ అభివృద్ధి, సంక్షేమాన్ని దేశవ్యాప్తం చేయాలన్నదే బీఅర్ఎస్ లక్ష్యమని కేశవరావు చెప్పారు. వ్యవసాయమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పార్టీ కిసాన్ సెల్స్ ప్రారంభిస్తామని వెల్లడించారు. బీఆర్ఎన్ కార్యాచరణను దేశమంతటా మరింత ఉధృతంగా తీసుకెళతామని అన్నారు.
మోదీ సర్కారుకు గుణపాఠం తప్పదు: నామా
ఉపాధి హామీ నిధులతో రైతులకు కల్లాలు నిర్మిస్తే వాటిని తిరిగి వాపస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం దుర్మార్గమని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే తెలంగాణ రైతాంగాన్ని గోసపెడుతున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ రైతుల పక్షపాతి అని, అందుకే రైతుల కోసం ఉపాధి హామీ పథకం కింద పంట కల్లాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. దీన్ని చూసి కేంద్రం ఓర్వటం లేదని ఆరోపించారు. కేంద్రం మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ నేత కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని అనేక రాష్ర్టాల నుంచి డిమాండ్ వస్తుందని చెప్పారు.