బెంగళూరు, అక్టోబర్ 8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో బీఆర్ఎస్తో జేడీఎస్ జోడీ కట్టనున్నది. కొత్త కలయికతో తన బలాన్ని పెంచుకోవాలని జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ చూస్తున్నది. కొత్త రాజకీయ సమీకరణల వల్ల జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల వలసలకు అడ్డుకట్ట పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం జేడీఎస్ శాసనసభ్యుల సంఖ్య 30. బీఆర్ఎస్ సాయంతో దాన్ని 60-70కి పెంచుకోవాలని జేడీఎస్ యోచిస్తున్నది. ‘హైదరాబాద్-కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతా ల్లో బీఆర్ఎస్కు రాజకీయంగా, భాషాపరంగా ఎంతో కొంత ప్రతిపత్తి ఉన్నది. జేడీఎస్కు యంత్రాంగం ఎలాగూ ఉన్నది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వీటికి కొత్త రాజకీయ వ్యూహాలను జోడిస్తే చాలా మంచి ఫలితాలను వచ్చే ఎన్నికల్లో సాధించవచ్చు. సరిహద్దు ప్రాంతాలైన బీదర్, యాద్గిర్, కల్బుర్గి, రాయచూరు, బళ్లారి జిల్లాల్లో కేసీఆర్ కూడా ప్రచారాన్ని చేయనున్నందున ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను కేసీఆర్ కంటే బాగా ఎవ్వరూ విశదీకరించలేరు’ అని భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నాలుగైదు లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉన్నది. ఆ స్థానాల్లో జేడీఎస్ అభ్యర్థులను పోటీకి నిలపకుండా బీఆర్ఎస్ గెలుపు కోసం శ్రమిస్తుందని పార్టీ వర్గాలు చెప్పాయి. బీఆర్ఎస్తో జేడీఎస్ చేతులు కలపటం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. 224 సీట్లు ఉన్న కర్ణాటక శాసనసభలో కేసీఆర్ సాయంతో జేడీఎస్ డబ్బు, ఎనభై స్థానాలను గెలుచుకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో చక్రం తిప్పే అవకాశాలు ఎకువగా ఉంటాయి.