దక్షిణాది నుంచి ఒక్కటే
జాతీయ పార్టీ కావడం అంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పోటీకి అవకాశాన్ని తీసుకోవడం. ఇది ఇప్పటిదాకా కొన్ని పార్టీలు అనుసరించిన మార్గం. కానీ, జాతీయ దృక్పధంతో, జాతీయ విధానంతో, జాతి తాత్వికతను అర్థ చేసుకొని దేశం మొత్తం విస్తరించే వ్యూహంతో దక్షిణాది నుంచి ఇటీవలికాలంలో వచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్.
స్పెషల్టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో స్వతంత్ర పార్టీ మినహా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి పెద్దగా ప్రభావితం చేసిన దక్షిణాది పార్టీ ఇప్పటివరకు లేదు. నెహ్రూ నాయకత్వంతో విభేదించి సీ రాజగోపాలాచారి, ఎన్జీ రంగా వంటి నేతలు స్వతంత్ర పార్టీని ఏపీలో స్థాపించారు. ఆ ఒక్క పార్టీ తప్ప జాతీయస్థాయికి ఎదిగిన దక్షిణాది పార్టీలు లేవు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నపటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు మాట్లాడే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ర్టాలకే అవి పరిమితమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో వాటి ఉనికి ప్రశ్నార్థకమే. అవి జాతీయ పార్టీల హోదా కూడా పొందలేకపోయాయి. తమిళనాడుకు చెందిన డీఎంకే, ఏఐఏడీఎంకే తమిళనాడు, పాండిచ్చేరికే పరిమితం. ఇప్పుడు టీఆర్ఎస్ ఒక్కటే దక్షిణాది రాజకీయ పార్టీల చరిత్రను తిరగరాస్తూ జాతీయ పార్టీగా అవతరించబోతున్నది.