హైదరాబాద్, జనవరి 26 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలువనున్నది. సింగరేణిలో కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నది. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
సింగరేణిలో జరిగిన అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు, స్పష్టమైన ఆధారాలతో సమగ్ర నివేదికను గవర్నర్కు అందజేయనున్నారు. సింగరేణి లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన కుటుంబీకులు, అనుచరులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములుగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నది. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఇంతటి భారీ స్కామ్లో భాగస్వాములైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులకు పదవుల్లో కొనసాగే నైతిక, రాజ్యాంగపరమైన అర్హత లేదనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులు గవర్నర్ ఎదుట నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.