జయశంకర్ భూపాలపల్లి/మంచిర్యాల/పెద్దపల్లి/ఖమ్మం, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు కన్నెర్రజేశారు. కోల్బెల్ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. సిరుల గని సింగరేణిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర సర్కారు ప్రైవేటీకరణ కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణ గుండెకాయ వంటి సింగరేణి గొంతుపిసికే మోదీ సర్కారుపై ఉగ్ర నరసింహులై పిడికిలెత్తుతామని శపథం చేశారు. పలుచోట్ల మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. నల్ల బెలూన్లను ఎగురవేశారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులకు వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ‘బీజేపీ హటావో.. సింగరేణి బచావో’ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మహాధర్నాలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన మహాధర్నాలకు సింగరేణి కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
విభజన హామీలు నెరవేర్చని మోదీ: ఎర్రబెల్లి
తెలంగాణ విభజన హామీలు కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఇలా ఏ ఒక్కటీ కేంద్రం నెరవేర్చలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుం టూ పోతేనే సహకరించడమా? అని ప్రధానిని నిలదీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం నిర్వహించిన మహాధర్నాలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రామగుండంకు వచ్చిన ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పారని, ఆ తర్వాత కొన్ని నెలలకే బొగ్గు బ్లాకుల వేలానికి తెరలేపారని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఉద్యమ నాయకుడైన సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. దేశ సంపదను మాత్రం మోదీ తమ దోస్తులైన అదానీ, అంబానీలకు పంచుతున్నారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. దేశంలోని అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన దేశ ప్రధాని కొన్ని రాష్ర్టాలపై మమకారం, మరికొన్ని రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్నాయక్, ఆరూరి రమేశ్, జడ్పీ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధూకర్, సంపత్రెడ్డి, బిందు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిపై ప్రధాని మోదీ కన్ను పడిందని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. సింగరేణి కార్మికులు ఉగ్ర నరసింహ అవతారం ఎత్తాలని, సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేసేవాళ్ల మీదికి తట్ట మర్లేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఢిల్లీలో కదలిక వస్తుందని సూచించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లో శనివారం నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించొద్దని, గనులను సింగరేణి సంస్థకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి 2021లోనే లేఖ రాశారని, మరి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిగ్నైట్ మైన్స్ను తమ కార్పొరేషన్కే ఇవ్వాలని అడగ్గానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిందని, అదే ఇక్కడ సింగరేణి సంస్థకు మాత్రం బొగ్గుబావులు ఇస్తలేదని మండిపడ్డారు. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు ఒక నీతి.. తెలంగాణకు ఇంకో నీతా.. అని నిలదీశారు. మోదీ కుట్రలను తిప్పికొట్టేందుకు సింగరేణి కార్మికులు బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాపురావు, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణపై అంత విద్వేషమెందుకు?:కొప్పుల
‘దేశ ప్రధానిగా తెలంగాణను తండ్రిలా చూసుకోవాల్సిన మోదీ రాష్ర్టాన్ని నిండా ముంచుతున్నడు. కుళ్లు, కుతంత్రాలతో పాలన సాగిస్తున్నడు. తెలంగాణ పేరు ఎత్తితేనే పగతో రగిలిపోతున్నడు. ఎందుకంత విద్వేషం. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు రాకుండా చేసింది నిజంకాదా? కొత్త ప్రాజెక్టులు రాకుండా, విభజన చట్టాలు అమలుకాకుండా తొక్కిపెట్టింది వాస్తవం కాదా? మోదీ సర్కారు అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది.’ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దేశాన్ని దోచుకుతినే అదానీ కావాలా? దేశానికి వెలుగులు పంచే కార్మికులు కావాలో తేల్చుకో? ’ అని మోదీని నిలదీశారు. 134 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణిని ప్రైవేటీకరిస్తే 45 వేల మంది కార్మికులు ఏం కావాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉద్యమాలు ఉధృతంగా చేపడతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హెచ్చరించారు. కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి గొంతు నులమడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. సింగరేణిని నష్టాలబాట పట్టించి మూత పెట్టించాలనే ఉద్దేశంతో కేంద్రం కుట్రలు పన్నుతున్నదన్నారు. సంస్థలో రాష్ర్టానికి 51 శాతం హక్కులు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం కుట్రలను పారనీయబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ, వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, రేగా కాంతారావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వెంకట్రావ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, హరిప్రియానాయక్, కందాళ ఉపేందర్రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.