హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. తమ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గాక అభయమిస్తుండటంతో మరింత బాధ్యతగా పనిచేస్తామని కార్యకర్తలు చెప్తున్నారు. అంతా కలిసి భోజనాలు చేస్తుండటంతో ఆత్మీయ సమ్మేళనాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నది. డప్పుచప్పుళ్ల మధ్య బోనాల ఊరేగింపులు, కళాకారుల ఆటపాటలతో వేదికలు సందడిగా మారుతున్నాయి. శనివారం రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జీలు హాజరయ్యారు. పార్టీ పరంగా కార్యకర్తల సంక్షేమానికి పార్టీ తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జీలు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. మూడోసారి కేసీఆర్ను అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలో, నాయకులు వారిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో దిశానిర్దేశం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి న్యాల్కల్లో బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవిలో నిర్వహించిన సమ్మేళనంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఉప్పరపల్లి క్రాస్రోడ్డులోని కల్యాణలక్ష్మి గార్డెన్స్లో వర్ధన్నపేట క్లస్టర్-1 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాకారుల ఆటపాటలకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్టెప్పులేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని ఎంఏఆర్ ఫంక్షన్హాల్లో 4, 5, 6, 7, 16, 17, 23, 24వ వార్డులకు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజలో జరిగిన సమ్మేళనంలో ఎమ్మెల్యే అబ్రహాం ప్రసంగించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మెదక్ జిల్లా మనోహరాబాద్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఎగ్గె మల్లేశం హాజరయ్యారు.
నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడులో ఎమ్మెల్యే నోముల భగత్, భువనగిరి నియోజకవర్గం భూదాన్పోచంపల్లిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హాజరయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ నియోజక వర్గం బీఎన్రెడ్డి నగర్, హయత్నగర్ డివిజన్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పాల్గొన్నారు. కాప్రాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతంనగర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఇన్చార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కందుకూరులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి హాజరయ్యారు.
కేసీఆర్ సారు రాకమునుపు తెలంగాణల ఎవుసం చేసే రైతులకు మందు బత్తాలు కావాల్నంటే దుకాణాల కాడ తెల్లార్లు మొగ మనుషులు నిలవడ్తెనే దొరుకుడు కట్టంగా ఉండేది. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం ఎట్ల తండ్లాడుతమో యూరియా బత్తాల కోసం అట్ల ఎదురుసూసేది. ఇంట్ల ఎవల పాణమన్న మంచిగ లేకుంటే దవాఖానల తొవ్వ పట్టంగనే సద్ది మూటలు ముల్లె గట్టుకొని బయలుదేరేది. దవాఖానాల శెరీకు అయితే ఇంటికాన్నుంచి అచ్చే సద్దిమూట ఎప్పుడత్తదా అని అటూఇటూ చూసేది. ఆరుగాలం కష్టం జేసి రైతులు పండించిన పంటలు అమ్ముకునేందుకు శానా తిప్పలు పడాల్సి వచ్చేది.
పండిన వడ్లను మచ్చు కోసం తువ్వాళ్ల మూట గట్టుకుని రైతులు ఊళ్లె ఉన్న సావుకార్లు, బ్యారగాళ్ల సుట్టూరా తిరుగుతూ ఒడ్లు కొనుండి నాయినా అని బతిమిలాడాల్సి వచ్చేది. వడ్ల మచ్చు సూపించినంక ఆళ్లు రూ.500లో, 1000లో కింటా సొప్పున కొంటే అడ్డికి పావుశేరు అమ్ముకొనేటోళ్లం. కానీ తెలంగాణ అచ్చినంక పరిస్థితులు మారిపోయినయ్. కేసీఆర్ సర్కారు ఊళ్లల్లనే కాంటా పెట్టించి గిట్టుబాటు ధరకు కొంటాంది. కేసీఆర్ సారు పుణ్యమా అని తెలంగాణల ఇయాల అన్ని సౌలత్లు అందుతున్నాయి.
– శ్రీపాది వసంత, బీఆర్ఎస్ కార్యకర్త, గ్రా: నల్లబెల్లి, జిల్లా వరంగల్