Telangana | మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి విమర్శించారు. ఆర్(రేవంత్), ఎస్(సంజయ్) బ్రదర్స్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని అన్నారు. ధర్నాల పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారని.. నిజంగానే మూసీ పరివాహక ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశం ఉంటే.. ఆ ప్రాజెక్టును ఆపొచ్చు కదా అని ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా అని వై.సతీశ్ రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన లోన్కు కూడా అనుమతి ఇవ్వాల్సింది కేంద్రమే అని తెలిపారు. అలాంటప్పుడు ఇద్దరు కేంద్రమంత్రులు ప్రధాని మోదీ దగ్గర, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చుని.. ప్రపంచబ్యాంకు లోన్నుఅడ్డుకోవచ్చని.. అప్పుడు మూసీ ప్రాజెక్టు ఆగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టును ఆపడం ద్వారా లక్షకు పైగా కుటుంబాల బతుకులు రోడ్డున పడకుండా ఉంటాయని అన్నారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి.. కేవలం పబ్లిసిటీ కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం సరికాదని హితవు పలికారు. అంతర్గంగా ఇద్దరు మద్దతు ఇచ్చుకుంటూ.. బయటకు మాత్రం బాధ ఉన్నట్టుగా నటిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, అలాగే రేవంత్ రెడ్డి, ఇద్దరు కేంద్రమంత్రులకు ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేకపోతే వెంటనే ప్రపంచబ్యాంకు లోన్ ప్రతిపాదనలను ఆపించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ను సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే మూసీ పరివాహక ప్రజల గురించి మాట్లాడే అధికారం బీజేపీకి ఉంటుందని అన్నారు. లేకపోతే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని మరోసారి మీ అంతట మీరే ఒప్పుకున్నట్టు అవుతుందని తెలిపారు.
ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని సతీశ్ రెడ్డి కోరారు. గతంలో చిన్న చిన్న అంశాలకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గవర్నర్లు ఇబ్బందులు పెట్టారని.. పాలన సరిగా సాగకుండా అడ్డుకున్నారని అన్నారు. కానీ ఇప్పుడు లక్ష కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చినా.. గవర్నర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గతంలో బీజేపీ పెద్ద నాయకుల ఆదేశాలతో 9 ముఖ్యమైన బిల్లులు నెలల పాటు గత గవర్నర్ ఆపారని గుర్తుచేశారు. మరి మూసీ విషయంలో బీజేపీ నాయకులు ఎందుకు గవర్నర్ ను కలిసి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పడం లేదని నిలదీశారు. అంటే బీజేపీది లోపల ఒక మాట.. బయట ఒకమాట.. అంతర్గతంగా హస్తంతో దోస్తీ చేస్తూ.. బయటకు మాత్రం మూసీ బాధితులకు మద్దతుగా నిలుస్తున్నట్టుగా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కానీ ఈ డ్రామాలు ఎన్నో రోజులు సాగవని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీల గుట్టు మొత్తం రట్టు చేసి ప్రజల ముందు నిలబెడతామని అన్నారు. మూసీ బాధిత ప్రజలు.. ఆ మూసీ నీళ్లతోనే రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కు అభిషేకం చేసి బుద్ధి చెబుతారని అన్నారు.