తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల ఆత్మగౌరవం పట్టని పార్టీ కాంగ్రెస్. రాష్ట్రం పట్ల కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ద్రోహపూరిత వైఖరిని అనుసరిస్తున్నది. తెలంగాణ చరిత్ర తెలియని అజ్ఞానులే సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు. కరెంట్ ఆందోళన నుంచే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్న కనీస సోయి లేకుండా కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిగా మాట్లాడటం దుర్మార్గం. కరెంట్ కోసం అల్లాడిన తెలంగాణ నేల ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్తో ఊపిరిపోసుకున్నది. ఆ ఊపిరికి ఉరివేయాలని కాంగ్రెస్ చూస్తున్నది.
– వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ తప్పదని మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి హెచ్చరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకుండా ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదని, పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరేనని ఆందోళన వ్యక్తంచేశారు. ఉచిత కరెంట్ చరిత్రే తెలియని కాంగ్రెస్ నేతలు రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తున్న సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని రంగాలకు విద్యుత్తును అందుబాటులో ఉంచొచ్చు, కానీ రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండకూడదా? అని ప్రశ్నించారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వారిది అదే విధానం అయితే ముందు ఆ పార్టీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటకల్లో అమలు చేయాలని, అప్పుడే తెలంగాణ ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉచిత విద్యుత్తు ఇచ్చిన దాఖలాలు లేవని తేల్చిచెప్పారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్కు రాష్ట్రానికో విధానం ఉండదని చెప్పారు. 3 నుంచి 8 గంటలు వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు పేర్కొనడం అంటేనే దానిని కాంగ్రెస్ విధానంగా భావించాల్సిందేనని స్పష్టంచేశారు.
రైతాంగం ఎప్పుడంటే అప్పుడు వినియోగించుకోవడానికి అనువుగా 24 గంటల విద్యుత్తును అందుబాటులో ఉంచిన సీఎం కేసీఆర్కు ఉన్న ఆలోచన కాంగ్రెస్కు ఉంటుందా? అని ప్రశ్నించారు. అన్ని రంగాలకు విద్యుత్తు 24 గంటలు అందుబాటులో ఉంచొచ్చు.. కానీ రైతులకు ఆ అవకాశం ఇవ్వకూడదా? అని నిలదీశారు. క్రాప్ హాలీడేలు, పవర్హాలీడేలు ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. రైతుల కరెంట్ చావులు, పారిశ్రామికవేత్తలు పారిపోవుడే కాంగ్రెస్ పాలన ఘనత అని ఎద్దేవాచేశారు. అవినీతికి, ఉచిత విద్యుత్తు ఎగవేతకు కాంగ్రెస్ పేటెంట్ అని ఎద్దేవాచేశారు. దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిన దొంగలకు కరెంట్ కొనుగోళ్ల వ్యవహారం కేంద్రం పరిధిలోని నియంత్రిత సంస్థలకే ఉంటుందన్న కనీస అవహన ఉంటుందా? అని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడి జైలులో ఊచలు లెకపెట్టినవారు మాత్రమే అన్నింటికీ పేటెంట్దారులని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుట్రలను రైతాంగం గుర్తించాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ దుర్మార్గాన్ని రాష్ట్ర రైతాంగం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కరెంట్ అందుబాటులో ఉండటం వల్లే రికార్డుస్థాయిలో పంటలు పండుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల కరెంట్ సౌకర్యాన్ని కల్పించడం వల్లే రైతులకు మేలు జరుగుతున్నదని వివరించారు.
కరెంట్పై కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రైతాంగానికి పిలుపునిచ్చారు. అమెరికాలో చంద్రబాబు అభిమానుల సమావేశంలో ఆయన శిష్యుడు, పీసీసీ అధ్యక్షుడు తెలంగాణలో ఉచిత కరెంట్పై చేసిన వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శమని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఆ పార్టీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, సుజాత చేసిన వ్యాఖ్యలు వారివి కాదని, అవి కాంగ్రెస్వేనని తేల్చిచెప్పారు. కరెంట్ విషయంలో కాంగ్రెస్ వైఖరిపై రైతు వేదికల వద్ద విస్తృతంగా చర్చచేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులను అవమానించిన రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చి దుర్మార్గ రాజకీయ ప్రయోజనం కోసం సీఎం కేసీఆర్పై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో అదనంగా 12 లక్షల వ్యవసాయ కనెక్షన్లు పెరిగాయని గుర్తుచేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా 40 శాతం అని, ఈ పెరుగుదలలో ఉచిత విద్యుత్తు పాత్ర గొప్పదని చెప్పారు. 3 గంటల కరెంట్ అన్న కాంగ్రెస్ వైఖరిని ఊరూరా ఎండగడతామని స్పష్టంచేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నన్నపునేని నరేందర్, పైలట్ రోహిత్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలను, ప్రజల ఆత్మగౌరవం పట్టని పార్టీ కాంగ్రెస్ అని మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ద్రోహపూరిత వైఖరిని అనుసరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ చరిత్ర తెలియని అజ్ఞానులే సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ కోసం ఉద్యమించిన రైతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన రోజే కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా బహిరంగ లేఖ రాసిన ఉదంతాన్ని గుర్తుచేశారు. కరెంట్ ఆందోళన నుంచే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్న కనీస సోయి లేకుండా కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిగా మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్తో ఊపిరిపోసుకున్నదని, ఆ ఊపిరికి ఉరివేయాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆరోపించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్తే సీఎల్పీ నేతగా జానారెడ్డి ‘24 గంటల కరెంట్ ఇవ్వడం అసాధ్యం. ఒకవేళ చంద్రశేఖర్రావు ఇస్తే నేనే టీర్ఎస్కు ప్రచారం చేస్తా’ అని చెప్పి.. ఆ తరువాత నాలుక కరుచుకున్నారని గుర్తుచేశారు. బ్లాక్ మెయిల్ చేసేవారికి ఎకరం సాగుకు ఎన్ని గంటల కరెంట్ కావాలో ఎలా తెలుస్తుందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్కు అధికారం వచ్చేది లేదు సచ్చేది లేదని, పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి కుకలు చింపిన విస్తరేనని, రైతులు ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు.