హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): 100 రోజుల పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. 100 రోజుల పాలన కాస్తా యూటర్న్, యూట్యూబ్ పాలనగా సాగిందని ఎద్దేవా చేశారు. రైతులు, మహిళలు, యువత, చేనేత కార్మికులు అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. వంద రోజుల్లో 174 మంది రైతులు, 38 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హస్తం కాస్తా ప్రజలపాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వందరోజుల పాలన మూడు విచారణలు.. ఆరు వేధింపులు అన్నట్టుగా సాగిందని ఎద్దేవా చేశారు.
మొదటి సంతకం రుణమాఫీ మీదేనంటూ మాటతప్పారని, కుర్చీ ఎక్కడాన్ని మాత్రం రెండు రోజులు ముందుకు జరుపుకొన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రగతిభవన్ను కూల్చి నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి అందులో డిప్యూటీ సీఎం ఉంటున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పారని, తామిచ్చే రైతుబంధును ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేని మండిపడ్డారు. ఆసరా పింఛన్లు పెంచుతామని చెప్పి ఉన్న పింఛన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే, రేవంత్రెడ్డి కరువు పెంచేందుకు పోటీపడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో పచ్చటి పొలాలు కనిపిస్తే 10 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో పంటలకు మంట పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో తాగునీటికి, సాగునీటికి లోటు లేదని, రేవంత్ పాలనలో కన్నీటికి కొరత లేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో తాము ఇంటింటికీ నీళ్లు అందించామని గుర్తుచేశారు.
100 రోజుల్లో సాధించింది ఏమన్నా ఉందా?
వంద రోజుల్లో కాంగ్రెస్ సాధించినదని ఏమైనా ఉందా.. అంటే రేవంత్రెడ్డి 10సార్లు ఢిల్లీకి వెళ్లి రావడమేనని హరీశ్రావు ఎద్దేవా చేశారు. గొల్లకురుమలకు 100 రోజుల్లో గొర్రెలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఆరోగ్యంపైనా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని నాడు పేర్కొన్న రేవంత్రెడ్డి ఇప్పుడు బీజేపీ నాయకుల ఇండ్లకు వెళ్తున్నాడని అన్నారు. ఫార్మాసిటీ, మెట్రో సహా పలు విషయాల్లో రేవంత్ యూటర్న్ తీసుకున్నారని దుమ్మెత్తి పోశారు. ఎత్తాల్సింది పార్టీ గేట్లు కారని, ప్రాజెక్టుల గేట్లు అని సూచించారు. కష్టాల్లో ఉన్న రైతులకు సాగునీరు అందించి సాయం చేయాలని కోరారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు
కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వానకాలం పంటకు ఎలాగూ బోనస్ ఇవ్వలేదని, కనీసం యాసంగి పంటకైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. కాంగ్రెస్ బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను చూసి ఓటేయాలని కోరారు. మ్యానిఫెస్టోలోని అంశాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు విడుదల చేయాలని పేర్కొన్నారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్ను నమ్ముకున్నందుకు ఆటో, చేనేత, రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. 100 రోజులపాలనలో సాధించిన అప్రతిష్ఠ, ఆత్మహత్యలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశా రు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు పెంచాలని ఇందిరాపార్ వద్ద ధర్నాలు చేస్తే విద్యార్థులను అరెస్టు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో మోటార్లు కాలలేదని, రైతన్నను కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం చెల్లించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
వారందరికీ తులం బంగారం ఇవ్వాల్సిందే
ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని చెప్పి మూడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం మహిళలకు రూ. 7,500 కోట్లు బకాయి పడిందని హరీశ్రావు చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరిగిన పెండ్లిళ్లకు తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 44 లక్షలమంది పింఛనుదారులు ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టబోతున్నారని హెచ్చరించారు. నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి ఏమైందని ప్రశ్నించారు. ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలకు మిగిలింది మరో 265 రోజులు మాత్రమేనని గుర్తు చేశారు. మెడమీద కత్తిపెట్టి తమ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హరీశ్రావు హెచ్చరించారు.