హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ‘మనమే తెలంగాణ గళం.. మనమే తెలంగాణ దళం.. మనమే తెలంగాణ బలం’ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్తున్నది. బీఆర్ఎస్సే ఎప్పటికైనా తెలంగాణ కు టార్చ్బేరర్ అని స్పష్టం చేస్తున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎప్పటికైనా పరిరక్షించేది బీఆర్ఎస్సేనని ఆధారాలతో సహా పార్టీ శ్రేణులకు వివరిస్తున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో అన్ని స్థాయిల పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నది.
తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్, బీజేపీలకు ఏమాత్రం పట్టింపులేదని ఆధారాలతో వివరిస్తున్నది. అందుకు 2014-19 (16వ లోక్సభ), 2019-2024 (17వ లోక్సభ)లో రాష్ట్రం నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్సభలో అడిగిన ప్రశ్నలను ప్రజలు ముందు ఉంచుతున్నది. లోక్సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ ఎంపీలు అడిగింది 1,271 ప్రశ్నలేనని, బీజేపీ ఎంపీలు కేవలం 190 ప్రశ్నలే అడిగి చేతులు దులుపుకున్నారని బీఆర్ఎస్ మండిపడుతున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రాన్ని నిలదీయడంతో ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేస్తున్నది. రెండు సభల్లో బీఆర్ఎస్ 4,754 ప్రశ్నలు అడిగి, కేంద్రాన్ని నిలదీసిన ఉదంతాలను వివరిస్తున్నది.