Jagadish Reddy | గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించిందని.. ఈ ఎన్నికల్లోనూ విజయం బీఆర్ఎస్దేనని మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందన్నారు. గుజరాత్లో సైతం పేదరికం పెరిగిందని.. దేశం యావత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు.
ఎన్నికలప్పుడే పాకిస్థాన్ గురించి బీజేపీ వాల్లు మాట్లాడుతారన్నారు. బీజేపీ అసలు రంగు బయటపడిందని.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. ఇక్కడ కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నదని విమర్శించారు. రుణమాఫీ చేస్తామని మభ్యపెడుతున్నారని.. బీసీ గణన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట మార్చిందన్నారు. యువత వీటిపై ఆలోచన చేయాలని.. యువతను నిలువునా ముంచింది కాంగ్రెస్సేనన్నారు. హాస్టల్స్లో విష ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారని.. ఇంత కంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు.
యువత విచక్షణతో ఓటు వేయాలని.. కోమటిరెడ్డిలాంటి చిల్లర వ్యక్తి గురించి మాట్లాడడం వృథా అని.. ఆయన నిలకడ లేని వ్యక్తి అటూ విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచనతో ఓటు వేయాలన్నారు. కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేస్తే అపాయింట్మెంట్ కాపీలను పంచుతూ రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. బీజేపీ అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని.. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. పార్టీల అభ్యర్థులను చూసి ఓటయ్యాలని.. పోరాటం చేసే వారిని ప్రోత్సహించాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పోరాట పటిమగల వ్యక్తి అని.. తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.