రంగారెడ్డి : తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని కూడా మార్చాలనే తపనతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలోని బీసీ కులాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆలోచించి జాతీయ స్థాయిలోనూ బీఆర్ఎస్కు మద్దతిచ్చేలా జాతీయ కులసంఘాలకు నచ్చజెప్పాలని సూచించారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీసీ కులాలు కేసీఆర్, బీఆర్ఎస్ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. నాటి పాలకులు బీసీలను ఓటర్లుగానే ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఏనాడు బీసీల ఆర్థిక స్థితిగతులపై మాట్లాడలేదని దుయ్యబట్టారు.
దేశవ్యాప్తంగా బీసీలు 80 కోట్లుండగా వీరి కోసం కేంద్రం కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. తెలంగాణలో రెండుకోట్లున్న బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయలను కేటాయించిందని వెల్లడించారు. ప్రత్యేకంగా బీసీ శాఖను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. కులవృత్తులందరికీ చేయూతను అందిస్తుందని తెలిపారు.
బీసీలకు చెందిన పిల్లలు విద్యాపరంగా ఉన్నత చదువులు చదువలానే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 325 గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు లక్షకోట్లు కేటాయించగా అధిక శాతం బీసీ వర్గాలకే దక్కనున్నాయని పేర్కొన్నారు. కుల సంఘాలు ఐక్యమత్యంతో పనులు సాధించుకోవాలని సూచించారు. విభేదాలతో రోడ్డకెక్కడం అవమానకరమని పేర్కొన్నారు. వృత్తి కులాలు నాగరికతను తెలియజేస్తాయని పేర్కొన్నారు.