Kyama Mallesh | హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాటల్లోనే ప్రజాపాలన.. చేతల్లో రాజరికపు పాలన నడుస్తోందని మల్లేశ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో క్యామ మల్లేశ్ మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు పరిపాలన చేస్తేనే ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రంలో స్థానికసంస్థల గడువు ముగిసినా ఎన్నికలు పెట్టలేదు. అడవిబిడ్డ సీతక్క పంచాయతీ రాజ్ శాఖామంత్రిగా ఉన్నారు. 20 నెలలు నుంచి ఎన్నికలు పెట్టలేని అసమర్థ స్థితిలో సీతక్క ఉన్నారు. మంత్రి పదవికి సీతక్క రాజీనామా చేయాలి అని మల్లేశ్ డిమాండ్ చేశారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీకాలం ముగిసింది. ఎన్నికలు పెట్టకుండా రేవంత్ రెడ్డి సామంతరాజులను నియమిస్తారా. ప్రభుత్వంలో అసమర్థ మంత్రులుగా ఉండి ఏం చేస్తారు…? గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడానికి పరిమితం అయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలకు ప్రోటోకాల్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదు అని క్యామ మల్లేశ్ హెచ్చరించారు.
తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్లో సీనియర్ మంత్రి. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా తుమ్మల వున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఒక్క బీజేపీలోనే చేరలేదు. సహకార సంఘాలకు ఆరు నెలల పదవీకాలం పొడిగించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో ఛైర్మన్ను రద్దు చేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావుకు మేము సలహాలు ఇచ్చే స్థితిలో లేము. హైకోర్టుకు వెళ్తే పాతవారిని చైర్మన్లుగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. నిజంగా మీరు మొగోళ్ళు అయితే ఎన్నికలు పెట్టండి. క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులు నాకు తెలియదు అని మల్లేశ్ ఎద్దెవా చేశారు.
సర్పంచుల్లో 51.5 శాతం బీసీలు వున్నారు. ఎంపీటీల్లో 50.5 శాతం బీసీలు వున్నారు. రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలు పెట్టకుండా రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారు. ఓడిపోతామనే భయంతో ఎన్నికలు పెట్టడం లేదు. ఎన్నికలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల తీర్పు కోరాలి అని క్యామ మల్లేశ్ సూచించారు.