హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లూ రేటెంతరెడ్డిగా ఉన్న రేవంత్.. ఇక నుంచి రైతుల పాలిట రాబందురెడ్డిగా మారాడని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతుబంధు సాయాన్ని నిలిపివేయించి రైతుల నోట్లో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణభవన్తో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయి రైతుబంధుని నిలిపివేశాయని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. రైతుబంధు వస్తే రేవంత్ ఎందుకు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు? రైతులు చల్లాగా ఉంటే ఆయనకు ఎందుకు కడుపుమంట? అని ప్రశ్నించారు.
తాజాగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కూడా రైతుబంధుపై ఫిర్యాదు చేయబట్టే.. సాయాన్ని నిలిపివేశారని, చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటమాడటం అన్యాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రైతుబంధు సొమ్ము పంపిణీని కాంగ్రెస్ నేతలు ఎలా అడ్డుకున్నారో ఆధారాలతో సహా ఆయన మీడియాకు చూపించారు. రైతుబంధుని నిలిపివేయించిన రేవంత్రెడ్డిని, కాంగ్రెస్ నేతలను ప్రజలు, రైతులు ఎక్కడికక్కడే గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు.