హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్యాస్ కొరత అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టారు. ఈ మేరకు అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒకవైపు ఎల్పీజీ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదని, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నదని, గోడౌన్ల వద్ద ప్రజలు భారీ క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం సహకరించడం లేదని నెపం మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
గ్యాస్ కొరతపై చర్చంచాలని, ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తిరస్కరించారు. ఇదిలా ఉంటే భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసే అంశంపై చర్చించాలని కోరుతూ సీపీఐ, దివ్యాంగుల సమస్యలపై చర్చ కోసం బీజేపీ వాయిదా తీర్మానాన్ని కోరాయి. వాటిని సైతం స్పీకర్ తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను సైతం పూర్తిచేయకుండా బడ్జెట్పై చర్చను ప్రారంభించారు.