LRS | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలో 25.44 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి రూ.20 వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపిస్తున్నది.
మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్కలు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టవద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిన వీడియోలను ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉండాలని, నాడు మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారని, వారు దీనిపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 7న జిల్లా కలెక్టర్లు, అర్డీవోలకు విజ్ఞాపన పత్రాలు అందించాలని నిర్ణయించింది. అప్పటికీ కదలికలేకుంటే న్యాయస్థానాలను సైతం ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. బుధవారం హైదరాబాద్లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, బీఆర్ఎస్ నాయకుడు తలసాని సాయికిరణ్, జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట మాజీ మంత్రులు తలసాని, దానం నాగేందర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మేయర్ విజయలక్ష్మి తదితరులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.