BRS | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): నాందేడ్లో మొదలైన బీఆర్ఎస్ హవా మహారాష్ట్ర అంతటా విస్తరిస్తున్నది. నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభల తర్వాత గులా బీ పార్టీకి మరాఠా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పుడు ఏ నోట విన్నా కేసీఆర్ నామస్మరణే. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాల సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతున్నదని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. తమను ఆదుకొనేందుకు ఎవరైనా రాకపోతారా?అని ఎదురుచూస్తున్న రైతుల కు, సాధారణ ప్రజలకు బీఆర్ఎస్ మంచి వేదికగా మారిందని అంటున్నారు. కేసీఆర్లో ఉన్న దార్శనికత మహారాష్ట్ర నేతలకు ఉంటే తమ రాత ఏనాడో మారేదని వారు పే ర్కొంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అనతికాలంలోనే సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ వేసిన ప్రశ్నతో మహారాష్ట్ర రాజకీయాలు ఆలోచనల్లో పడ్డాయని వారు విశ్లేషిస్తున్నారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహించిన మూడు సభలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయని మహారాష్ట్ర గులాబీ నేతలు చెప్తున్నారు. మహారాష్ట్ర రైతాంగంతో విడదీయరానిబంధం పెనవేసుకొన్న షేత్కరీ సంఘటన్, శంభాజీ బ్రిగేడ్వంటి సామాజిక సంస్థలు బీఆర్ఎస్తో మమేకం కావడంతో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్పట్ల ఆకర్షితులు అవుతున్నారని చెప్తున్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో బీఆర్ఎస్ను విస్తరించి, ప్రజల ఆదరణను చూరగొంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘అబ్ కీ బా ర్ కిసాన్ సర్కార్’ నినాదం తమ ప్రాంత ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని చెప్తున్నారు.‘మహారాష్ట్రలో ఇప్పటివరకు రైతులు, పీడితులు, వంచితులకు ఏ పార్టీ ఏ నాయకు డు ధైర్యాన్ని ఇవ్వలేదు. కానీ, కేసీఆర్ అన్ని వ ర్గాలను ఆదుకుంటామనే భరోసా ఇచ్చారు. అందుకే కేసీఆర్ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాం’ అని నాగ్పూర్కు చెందిన మంగేశ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర పవిత్రభూ మి శివాజీ, అంబేద్కర్ను సదా స్మరించుకుంటుందని, యవత్మాల్కు చెందిన సంతోష్వాగ్డే తెలిపారు.
తెలంగాణలో అన్ని రంగాల్లో కేసీఆర్ మహిళలకు అపూర్వ అవకాశాలు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాలపై మహారాష్ట్రలోని ప్రతీ మహిళకు అవగాహన ఉన్నది. కేసీఆర్ కిట్పై గర్భిణులు, వారి కుటుంబాల్లో చర్చ జరుగుతున్నది. పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్ ఇలా మహారాష్ట్ర అన్ని ప్రాంతాల్లో మేము పర్యటించాం. రాజకీయాలతో పరిచయంలేని సాధారణ మహిళలు సైతం కేసీఆర్ పథకాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇంత తక్కువ కాలంలో మహారాష్ట్రలో కేసీఆర్ ఇంత ప్రభావాన్ని చూపారా? అని మాకే ఆశ్చర్యం కలుగుతున్నది. మహారాష్ట్ర మహిళల జీవితాలను బీఆర్ఎస్ తప్పక మారుస్తుందన్న విశ్వాసం ఉంది.
-సువర్ణ కాటే బగల్, పుణె
మహానేత కేసీఆర్ తెలంగాణలో రైతును రాజుగా చేసి చూపారు. వ్యవసాయ రంగంలో అతి తక్కువ కాలంలోనే విప్లవాన్ని తెచ్చారు. మహారాష్ట్ర రైతులే కాదు యావత్తు దేశ రైతాంగం కేసీఆర్వైపు చూస్తున్నది. రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేసే మాలాంటి ఎంతోమంది కేసీఆర్ మార్గంలో నడవాలని ఊరికే నిర్ణయించుకోలేదు. మేమే కాదు తొందరలోనే యావత్తు దేశం కేసీఆర్ చూపిన మార్గంలో, బీఆర్ఎస్ వేసిన దారిలో నడవక తప్పదు.
– మాణిక్ కదం, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు
ఎంతోకాలం నుంచి షేత్కరీ సంఘటన్లో పనిచేస్తున్నా. శరద్జోషి స్థాపించిన ఈ సంఘం యావత్తు బీఆర్ఎస్తో మమేకం అయ్యింది. సామాజిక, ఆర్థిక రంగాల్లో మార్పు రావాలని రెండున్నర దశాబ్దాలుగా మహారాష్ట్రలో పనిచేస్తున్న శంభాజీ బ్రిగేడ్ కూడా కేసీఆర్తో జతకట్టింది. విదర్భ, మరాఠ్వాడల్లోనే కాదు ఈ రెండు సంస్థలకు మహారాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యశ్రేణి ఉన్నది. దేశానికి తెలంగాణ మాడల్ అత్యంత ఆవశ్యకం. కేసీఆర్ రూపంలో మా కలలు సాకారం అవుతాయని విశ్వాసంతో ఉన్నాం.
-సుధీర్ సుధాకర్రావు బిందు, బీఆర్ఎస్ నాయకుడు
కేసీఆర్ నిజాయితీ, పనితీరును అంచనావేసేందుకు తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు పథకం ఒక్కటి చాలు. ఎస్సీ, ఎస్టీసహా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మహారాష్ట్రలో పుట్టిన అంబేద్కర్కు అక్కడి ప్రభుత్వం ఇవ్వనంత గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టడం వంటి సాహసోపేత చర్యలు సామాన్య పాలకులకు సాధ్యం కాదు. నా రాజకీయ జీవితంలో కేసీఆర్లాంటి నాయకుడిని చూడలేదు. నిమ్నవర్గాలు కేసీఆర్లో అంబేద్కర్ను చూసుకొంటున్నాయి.
-కైలాస్రావ్, మాజీ ఎమ్మెల్యే, నాగ్పూర్