హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతాంగం సమస్య చాలా తీవ్రంగా ఉందని.. కొత్త ప్రభుత్వం నదీ జలాలపై తక్షణం సమీక్ష చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 90 రోజులైనా సాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో నీళ్లు వృథాగా పోతున్నాయని, 4 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి ఎందుకు వదిలిపెట్టారో సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కరెంట్ పోతేనే కరెంట్ గుర్తు వస్తుందని ఎద్దేవా చేశారు. 5 ఎకరాల లోపు రైతులకు ఇంత వరకు రైతుబంధు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, యాసంగి క్రాప్ లోన్లపై సమీక్ష చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచి దండన తప్పదని హెచ్చరించారు.