హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే భారత రాష్ట్ర సమితి రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రాబోయే కర్నాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ జేడీఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటాం అని పేర్కొన్నారు. మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని, జేడీఎస్ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను వారికి వివరిద్దాం అని సూచించారు. గతంలో కర్నాటక పోయినప్పుడు చెప్పినట్టే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. భగవంతుని కృపతో, మన పట్టుదలతో మరోసారి సీఎం అవుతాడనే విశ్వాసం ఉందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే ప్రారంభం అవుతుందని సీఎం ఉద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు మనం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో ప్రజల్లోకి పోయి సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. నేడు భారతదేశ అభివృద్ధి గుణాత్మక మార్పు లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెందడం చారిత్రక అవసరం అని కేసీఆర్ నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ అనే వెలుగుదివ్వెను దేశం నలుమూలలకు వ్యాపింపచేద్దాం. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల ముందు పెట్టి దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేసి భరతమాత సంతృప్తి చెందేలా బీఆర్ఎస్తో మన ప్రయాణం కొనసాగిద్దాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం అని కేసీఆర్ తెలిపారు. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలి. మరో రెండు మూడు నెలల్లో మన సొంత బీఆర్ఎస్ భవనం పూర్తవుతుంది. అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు అని కేసీఆర్ పేర్కొన్నారు.