బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని సంతకం. అన్ని రకాల భావజాలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తియుక్తులున్న పార్టీ. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. పార్టీదే భవిష్యత్తు. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురికావొద్దు. లోకసభ ఎన్నికల్లో సత్తాచాటుదాం.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను ఉఫ్మని ఊదేస్తామని కొందరు పగటికలలు కంటున్నారని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజల బలమైన గొంతుక బీఆర్ఎస్ అని అన్నారు. 23 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చాలా మంది విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అందరూ బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయటం ఎవరితరమూ కాదని తేల్చిచెప్పారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ ని యోకవర్గ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిస్థాయిల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి త్వరలోనే శిక్షణా తరగతులను నిర్వహిస్తామని తెలిపారు.
చెక్కుచెదరని ఉక్కు సంతకం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక అని, తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపమని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ చెక్కుచెదరని ఉక్కు సంతకం అని పేర్కొన్నారు. అన్ని రకాల భావజాలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తియుక్తులన్న పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. బలమైన తెలంగాణ గొంతుకగా ఉన్న బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ క్యాడర్కు తెలంగాణ భవన్లో తాను, ఇతర సీనియర్ నేతలందరూ అందుబాటులో ఉంటామని, తెలంగాణ భవనే తమ అడ్డా అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నదని విమర్శించారు. తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అభయమిచ్చారు. పార్టీకి పటిష్ఠమైన లీగల్ సెల్ ఉన్నదని, తప్పుడు కేసుల బాధితులకు లీగల్సెల్ అండగా ఉంటుందని తెలిపారు. ఒక కార్యకర్తపై కేసు పెడితే ఆ ప్రాంతంలోని నాయకులంతా సమష్టిగా స్పందించాలని, కేసు తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం కూడా స్పందిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్కు సినిమా మొదలు కాలేదు
కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చేదాకా బాధ్యతాయుత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు. కాంగ్రెస్ హామీలను ప్రతిరోజూ గుర్తుచేస్తూనే ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే తొందరపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నారనే అపవాదును మూటగట్టుకోవద్దని అనుకున్నామని, అయితే ఈలోగా కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనికి కొత్త ప్రభుత్వం పూనుకొని అసత్య శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆసలు సినిమా ముందున్నదని అన్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలు రద్దు చేస్తామని సీఎం అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు.
సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, టీ రాజయ్య, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, రావుల చంద్రశేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, ఎన్ సుధాకర్రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు పూర్వవైభవం వస్తుంది: గండి యాదగిరి
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్కు తిరిగి పూర్వవైభవం వస్తుందని స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండలం వడిచర్ల గ్రామానికి చెందిన గండి యాదగిరి అన్నారు. దివ్యాంగుడినైన తాను మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీతో మమేకం అయ్యాయని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వీల్చైర్లో వచ్చారు. యాదగిరిని చూసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఏర్పడింది.
బీఆర్ఎస్దే భవిష్యత్తు
బీఆర్ఎస్ పార్టీదే భవిష్యత్తు అని, పార్టీ శ్రేణులెవరూ నిరుత్సాహ పడాల్సిన పనిలేదని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికిగల కారణాలను సంపూర్ణంగా విశ్లేషించుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుందామని తెలిపారు. పదేండ్లలో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దే అన్నారు. ‘ప్రభుత్వం పథకాలు అమలు చేసే క్రమంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉండటం, వారిని పార్టీ ప్రతినిధులుగానే ప్రజలు గుర్తిస్తారని భావించి ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించొద్దనే ఆలోచనతోనే చేశాం తప్ప పార్టీని విస్మరించాలని కాదు.
నిత్యం ప్రజల మధ్యే ఉన్న అభ్యర్థులు కూడా ఓడిపోవడం కొంత బాధాకరమే. లోపం ఎక్కడ జరిగిందో గ్రహించి సరిదిద్దుకునే కార్యాచరణ రూపొందించుకొందాం. తిరిగి ప్రజాభిమానాన్ని పొందుతామనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రజలు బీఆర్ఎస్ను పూర్తిగా తిరసరించలేదు. 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి బీఆర్ఎస్ను బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉండాలని తీర్పు ఇచ్చారు’ అని వివరించారు.