KTR | రాజన్న సిరిసిల్ల : తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. ఇది స్వల్ప కాలం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమం సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం.. నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి, పోరాటాలు తమకేం కొత్త కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుతాం అని చెప్పారు. పవర్ పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం సహజం. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని కేటీఆర్ తెలిపారు.