హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని తెలిపారు. ఫీనిక్స్ పక్షిలా గా తిరిగి లేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని గుర్తుచేశారు.
అద్భుతమైన విజయాలతోపాటు అనేక ఎదురుదెబ్బలు ఎదురొన్న అనుభవం పార్టీకి ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మించిన గౌరవం, విజయం మరేది లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయని గుర్తుచేశారు.
తెలంగాణ సాధించటంతోపాటు ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ 2014 లో 63 సీట్లు, 2018లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుత శాసనసభలోనూ మూడోవంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతున్నదని తెలిపారు. ‘రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమే. గెలిచినప్పు డు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని మా పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారు.
బీఆర్ఎస్ పార్టీ అదే సిద్ధాంతాన్ని పాటిస్తుంది’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ‘పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా మమ్మల్ని నిరాశ పరిచాయి. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోయేది లేదు. ఎప్పటిలాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాం. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం’ అని చెప్పారు.
తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.